పోలింగ్ ఏజెంట్లు కీలకం
● అమ్ముడు పోతే అభ్యర్థి పరిస్థితి అంతే సంగతి
● ఒక్క ఓటుతో కూడా ఓటమి చెందే అవకాశం
● అత్యంత విశ్వాసపాత్రులే
ఏజెంట్లుగా ఉండాలి
అచ్చంపేట/కల్వకుర్తి టౌన్: పోలింగ్ బూత్లో అభ్యర్థుల తరఫున పరిశీలన కోసం కూర్చుండే ఏజెంట్ల పాత్ర చాలా కీలకం. బోగస్ ఓట్లు పడకుండా ఓటేయడానికి వచ్చే వారిని నిశితంగా చూడాలి. ఒక ఓటు తేడాతో అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉన్నందున ఏజెంట్లుగా ఉండేవారు అభ్యర్థికి అత్యంత విశ్వాసపాత్రులుగా ఉండాలి. లేకపోతే ఇతర అభ్యర్థులకు అమ్ముడుపోయే సందర్భాలు కూడా ఉంటాయి. పోలింగ్ ఏజెంట్ల నియామకంలో ఎన్నికల సంఘం కొన్ని మార్పులు చేసింది.
● పోలింగ్ స్టేషన్లో గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు, రాష్ట్ర పార్టీలు, గుర్తింపు పొందిన ఇతర రాష్ట్రాల పార్టీలు, తమ ఎన్నికల గుర్తును ఇక్కడ ఉపయోగించడానికి అనుమతి పొందిన వారు, గుర్తింపు పొందని రిజిస్టర్ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో కుర్చీలు వేస్తారు.
● పోలింగ్ ఏజెంట్లు తప్పనిసరిగా అదే గ్రామానికి చెందిన వారై ఉండి, ఓటరుగా నమోదై ఉండి, ఎన్నికల సంఘం ఫొటో గుర్తింపు కార్డు కూడా కలిగి ఉండాలి.
● ప్రతి పోలింగ్స్టేషన్కు ప్రతి అభ్యర్థి తరపున పోలింగ్ ఏజెంట్, ఇద్దరు రిలీఫ్ ఏజెంట్లను నియమించుకోవచ్చు.
● పోలింగ్ ఏజెంట్ ఫారం–10లో పోటీచేస్తున్న అభ్యర్థి లేదా అతని ఎన్నికల ఏజెంటు నియామక పత్రం పొందిన వారికి నిరూపణ డిక్లరేషన్పై ఏజెంట్ పాస్ జారీ చేస్తారు.
● ఒక్కో బూత్కు మూడు పాసులు జారీ చేసిన ఒక్కరు మాత్రమే కూర్చోవడానికి అనుమతి ఇస్తారు. ఓటర్ల జాబితాను బయటకు తీసుకెళ్లేందుకు వీలు ఉండదు.
● పోలింగ్ ఏజెంట్ల ఓటింగ్ సమయానికి కనీసం గంట ముందుగా బూత్కు చేరుకోవాలి. ఆలస్యంగా వెళ్లినా అధికారులు వారి ప్రక్రియ వారు చేసుకుపోతారు. ఆలస్యమయితే సీల్లో ఏజెంట్ సంతకం చేయటం, పరిశీలన చేయలేకపోతారు. అలాగే ఓటింగ్ ముగిసిన అనంతరం కూడా బ్యాలెట్ బాక్సుల సీలింగ్ ప్రక్రియను పర్యవేక్షించి దానిపై సంతకం చేయాలి.


