‘తులం బంగారం ఏమైందని నిలదీయండి’
కొల్లాపూర్: ప్రజలను ఓట్లడిగే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఇప్పటివరకు నెరవేర్చలేదని ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం కొల్లాపూర్లో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ అల్లీపూర్ వెంకటేశ్వరరెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నవీన్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. ఓట్లడిగేందుకు వస్తున్న కాంగ్రెస్ నాయకులను ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదని నిలదీయాలన్నారు. కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఏమైందని ప్రశ్నించాలని సూచించారు. రైతుభరోసా ఎగ్గొట్టారన్నారు. మాయమాటలతో ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారని, వారి మాటలు నమ్మొద్దని హితువు పలికారు. బీరం హర్షవర్ధన్రెడ్డి మాట్లాడుతూ కొల్లాపూర్ మున్సిపాలిటీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు బీఆర్ఎస్ హయాంలో జరిగాయన్నారు. ప్రతి వార్డులో సీసీ రోడ్లు, మురుగుకాల్వలు నిర్మించామని, తాగునీటి వసతులు మెరుగుపర్చామని, ఆలయాలు, దర్గాలు అభివృద్ధి చేశామని, స్మశానవాటికలకు రోడ్లు వేయించి, భూములు ఇప్పించడంతో పాటు వాగులపై బ్రిడ్జిలు కట్టించామని గుర్తుచేశారు. రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, మరో రెండేళ్లలో చేయబోయేది కూడా ఏమీ లేదని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీలతో గెలిపించాలని కోరారు.


