కారు గుర్తుకు ఓటేస్తే డస్ట్బిన్లో వేసినట్టే
పాలమూరు: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేస్తే డస్ట్ బిన్లో వేసినట్టే అవుతుందని, బీజేపీకి ఓటు వేస్తే ఎలాంటి అభివృద్ధి జరగదని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మహబూబ్నగర్లోని 23వ డివిజన్ మర్లులో ఆదివారం నిర్వహించిన కార్నర్ మీటింగ్లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డితో కలిసి మాట్లాడారు. హస్తం గుర్తుకు ఓటువేస్తే రమేష్రెడ్డి మాతో పాటు కూర్చొని డివిజన్ అభివృద్ధి పనులపై చర్చించి సంబంధిత నిధులు తెచ్చి పనులు చేస్తాడన్నారు. గతంలో ఉన్న పాలకులు పదేళ్లు ఉండి ఎలాంటి అభివృద్ధి చేయలేదని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిపనులు చేస్తుందన్నారు.
● మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నగర పరిధిలో పాలకొండ, క్రిస్టియన్పల్లి, గొల్లబండ తండా, బండమీదిపల్లి, హనుమాన్పురా, శాంతినగర్, విఘ్నేశ్వర కాలనీ–మర్లు, కోయనగర్, న్యూమోతీనగర్, ఎంప్లాయీస్ కాలనీ, గణేష్నగర్, వల్లభ్నగర్, బండ్లగేరి, సద్దలగుండు, శేషాద్రినగర్, బీకేరెడ్డికాలనీ తదితర ప్రాంతాల్లో ఎమ్మెల్యే విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎ.ఆనంద్కుమార్గౌడ్, కాంగ్రెస్ అభ్యర్థి బీసం వరలక్ష్మీ, యువనాయకుడు సోమిరెడ్డి రమేష్రెడ్డి, సందీప్, అప్పు, నరేష్, సాయి, వేణు, పృథ్వీరెడ్డి, సలీం, మేరాజ్ తదితరులు పాల్గొన్నారు.


