చోరీ కేసును ఛేదించిన పోలీసులు
నాగర్కర్నూల్ క్రైం : వృద్ధురాలిపై దాడి చేసి బంగారు, వెండి ఆభరణాలను చోరి చేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ అశోక్ రెడ్డి తెలిపారు. ఈనెల 2న తెల్కపల్లి మండల కేంద్రంలో వృద్ధురాలిపై దాడి చేసి నగలు అపహరించిన ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ శనివారం తన కార్యాలయంలో వెల్లడించారు. తెల్కపల్లి మండలంలోని రాకొండ గ్రామానికి చెందిన రాములమ్మ ఎరుకలి గద్దె చెప్పుకుంటూ జీవనం సాగిస్తుంది. ఈమె మండల కేంద్రంలో ఓ గది అద్దెకు తీసుకుని రాత్రి వరకు అక్కడే ఉండి పొద్దుపోయాక స్వగ్రామానికి వెళుతుండేది. ఈ క్రమంలో ఈనెల 2న బల్మూరు మండలం కొండనాగులకు చెందిన శ్రీను రాములమ్మను పరిచయం చేసుకుని కల్లు తాగించాడు. ఆమెను తన ద్విచక్రవాహనంపై ఇంటి వద్ద దింపుతానని తీసుకెళ్లి రోకలి బండతో దాడి చేసి 8 గ్రాముల బంగారు నగలు, 30 తులాల వెండి కడియాలను చోరీ చేసి పరారయ్యాడు. రోజు ఇంటికి వచ్చె తన తల్లి రాకపోవడంతో కుమారుడు వచ్చి చూడగా తీవ్ర గాయాలైనట్లు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. మరుసటి రోజు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తెల్కపల్లిలోని కల్లు కాంపౌండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని అదుపులోకి విచారించగా నేరాన్ని అంగీకరించాడు. చోరీ చేసిన బంగారు, వెండి ఆభరణాలు, ఇతర సామగ్రి రికవరీ చేసినట్లు తెలిపారు. నిందితుడుపై ఇది వరకే హైదరాబాద్, శంషాబాద్, మొయినాబాద్ పోలీస్స్టేషన్లలో దొంగతనం కేసులు ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో తెల్కపల్లి ఎస్సై నరేష్, ఐడిపార్టీ కానిస్టేబుల్లు భీముడు, వెంకటేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
నిందితుడికి రిమాండ్


