సరిహద్దు పట్టణం అయిజలో.. ఎన్నికల సందడి
2012లో నగర పంచాయతీ
2018లో మున్సిపాలిటీ
మూడోసారి జరగనున్న ఎన్నికలు
అయిజ: తెలంగాణ రాష్ట్రం దక్షిణ సరిహద్దు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఆనుకొని ఉన్న అయిజ 2012లో గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా రూపాంతరం చెందింది. 2018లో మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయ్యింది. సుమారు రూ.3 కోట్ల ఆదాయంతో ఉన్న మున్సిపాలిటీలో 31 వేల జనాభా, 8 వేల నివాసగృహాలు, 23 వేల మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీ విస్తీర్ణం సుమారు 7 చదరపు కిలో మీటర్లు. 201 సెన్సస్ ప్రకారం జనాభా 22,708 కాగా, 2011 సెన్సస్ ప్రకారం 27,921 మంది ఉన్నారు.
ఉత్కంఠగా మున్సిపల్ ఎన్నికలు
అయిజలో మూడోసారి నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికలు ఉత్కంఠ పెంచాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. పదేళ్ల అనంతరం మున్సిపల్ చైర్మన్ పదవి బీసీలను వరించడంతో బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న మున్సిపాలిటీ కావడంతో చైర్మన్ పదవికి పోటీ పెరిగింది.
చరిత్రకు సాక్ష్యాలుగా పురాతన ఆలయాలు
అయిజ చరిత్ర నియోలిథిక్ కాలం నుంచి మొదలవుతుంది. ఇక్కడి ప్రాంతాల్లో పురాతన మానవ నివాసాల ఆధారాలు లభించాయి. గద్వాల సంస్థాన పాలకుడు నల్ల సోమనాద్రి హయాంలో నిర్మించిన బక్కమ్మ బావి ప్రస్తుతం శిథిలావస్థలో ఉండడం విచారకరం, అదే విధంగా చాణుక్య రాజులు నిర్మించిన శివాలయం ఇక్కడ చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. వనవాసం సమయంలో రాముడు, సీతాదేవి ప్రతిష్ఠించిన శివలింగాలు ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఈ దేవాలయాలు అయిజను ఆధ్యాత్మిక కేంద్రాలుగా మార్చాయి. సుమారు వంద సంవత్సరాల క్రితం మతి స్థిమితం లేకుండా తిరేగా వ్యక్తి వీరప్ప మహిమలు చూపుతూ ఉండేవాడని, అయిజలో సజీవ సమాది అయ్యారని పూర్వీకులు తెలుపుతున్నారు. అయితే సమాధిపైనే ఆయన పేరుతో ఆలయం నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తిక్కవీరేశ్వరస్వామి జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.


