హామీలు విస్మరించిన చంద్రబాబు
● ఎస్టీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
కర్నూలు(సెంట్రల్): సీఎం చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు విస్మరించడం పట్ల ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. శుక్రవారం ఎస్టీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నాకు చేపట్టారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టీకే జనార్ధన్, సుంకన్న అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో ఆ సంఘం పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్.తిమ్మన్న, రాష్ట్ర సహాధ్యక్షుడు ఎస్.గోకారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అడివన్న, రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యుడు మహదేవప్ప మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకపోవడం అన్యాయమన్నారు. వెంటనే 12వ పీఆర్సీని వేసి 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు. సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలన్నారు. 2001 సెప్టెంబ్ 1 కంటే ముందు నోటిఫికేషన్ ద్వారా నియామకం పొందిన 2003 డీఎస్పీ ఉపాధ్యాయులు, పోలీసులను ఓపీఎస్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన గ్రాట్యుటీని వెంటనే మంజూరు చేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. లేదంటే ఫిబ్రవరి 25వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా ఆర్థిక కమిటీ ఎం.శ్రీధర్, జిల్లా నాయకులు వాణి, కన్వీనర్ జీసీ నరసింహుడు, సి.నాగరాజు, రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.


