బంజారాల మార్గదర్శి
● నేడు సేవాలాల్ మహరాజ్ జయంతి
నిజామాబాద్ రూరల్: బంజారాలలో హిందూ చైతన్యాన్ని పెంపొందించి, భక్తిని ప్రేరేపించి, సమాజాన్ని సంఘటితం చేసిన గొప్ప సంఘసంస్కర్త, బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్. ఆదివారం సేవాలాల్ మహరాజ్ జయంతిని బంజారాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయాల్లో భోగ్ బండార్, ఖీర్ (పాయసం)తో నైవేద్యం సమర్పించి ఉపవాసాలు చేస్తారు. బంజారా యువకులు సేవాలాల్ దీక్షను స్వీకరిస్తారు.
సన్మార్గంలో నడిచేలా..
భీమానాయక్, ధర్మిణియాడ దంపతులకు 1739లో ఫిబ్రవరి 15న సేవాలాల్ జన్మించాడు. సేవాలాల్ మహరాజ్ దేవిమాతకు పూజలు చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో పయనించారు.అటవీ ప్రాంతంలో జీవిస్తున్న బంజారాలంతా భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరుకుంటారని,దాని కోసం ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలని సూచించేవారు.బంజారాలంతా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని బోధించారు. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తేనే సమాజ వికాసం జరుగుతుందని చెప్పేవారు. అలా చీకటిలో ఉన్న బంజారాలను వెలుగులోకి తీసుకొచ్చిన సేవాలాల్ మహరాజ్ దైవ స్వరూపుడుగా, ఆధ్యాత్మిక చైతన్యకారుడిగా ప్రసిద్ధి చెందారు. చివరకు మహారాష్ట్రలోని పౌరాఘడ్లో స్వర్గస్తులైనట్లు పూర్వీకులు చెబుతారు. మహరాజ్ సమాధి ఉన్న వీరఘడ్ ప్రాంతం ప్రసిద్ధ బంజారా పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది.
ప్రభుత్వం సేవాలాల్ మహరాజ్ జయంతిని సెలవుదినంగా ప్రకటించాలి. సేవాలాల్ జయంతి ఉత్సవాలకు మంజూరు చేస్తున్న నిధులను పెంచాలి. సేవాలాల్ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి.
– బానోత్ ప్రేమ్లాల్, బంజార కవి, రచయిత
బంజారాల మార్గదర్శి


