తక్షణ పరిష్కారమే లక్ష్యం
● ప్రజాదివస్లో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
భూపాలపల్లి అర్బన్: ప్రజల సమస్యలకు పోలీసులు తక్షణ పరిష్కార మార్గం చూపాలని ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ అధ్యక్షతన ప్రజాదివస్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన 10 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను శ్రద్ధగా విని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ సూచనలు చేశారు. ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ, సంబంధిత పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్ఐలతో నేరుగా మాట్లాడి, సమస్యల పరిష్కారానికి అవసరమైన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతీ సోమవారం ప్రజాదివస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరిస్తూ, సంబంధిత అధికారుల సమన్వయంతో వాటిని పరిష్కరిస్తున్నామని, ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం అందించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు.


