బాలకుమారస్వామికి మంత్రి సీతక్క పూజలు
ములుగు రూరల్: మండల పరిధిలోని అంకన్నగూడెం బాలకుమారస్వామి జాతరలో గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పాల్గొని మహిళలతో కలిసి నృత్యం చేశారు. అనంతరం ఆమె ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమ్మక్క సోదరుడిగా బాలకుమార స్వామిని కొలుస్తారని తెలిపారు. సమ్మక్కకు యుద్ధ సమయంలో అండగా బాలగోముడుగా నిలిచాడని వివరించారు. ఆయనను గండ్ర గొడ్డలి రూపంలో కొలుస్తారని వెల్లడించారు. అనంతరం ఆలయ మరమ్మతులకు ఎస్డీఎఫ్ నిధుల నుంచి రూ. 5 లక్షల కేటాయించి పనులను ప్రారంభించారు.
ఇందిరమ్మ ఇళ్ల తనిఖీ
కాళేశ్వరం: మహదేవపూర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను హౌసింగ్ పీడీ లోకిలాల్, డీఈ శ్రీకాంత్ తనిఖీ చేశారు. గురువారం లబ్ధిదారులతో ఇందిరమ్మ ఇళ్లు సకాలంలో నిర్మించాలని ఆదేశించారు. ఏమైనా సమస్యలు ఉంటే అధికారులకు తెలుపాలన్నారు. సర్పంచ్ హసీనా బానో, ఏఈ సందీప్, పంచాయతీ కార్యదర్శి కల్పన, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
నేడు సరస్వతినది
పుష్కరాలపై సమీక్ష
కాళేశ్వరం: మే 21 నుంచి జూన్ 1 వరకు జరుగు సరస్వతినది అంత్యపుష్కరాలపై ఉన్నతాధికారులతో దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, రాష్ట్ర ధార్మిక సలహాదారు గోవిందహరి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించనున్నట్లు ఈవో మహేశ్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నాను. శుక్రవారం (నేడు) సమీక్షను ఉదయం 10:30గంటలకు కాళేశ్వరం దేవస్థానం ఈఓ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ సంకీర్త్తో పాటు జిల్లాస్థాయి అధికారులు హాజరుకానున్నారని తెలిసింది.
మేడారం క్లీన్..
ఎస్ఎస్ తాడ్వాయి: మేడారంలో పారిశుద్ధ్య పనులు జోరుగా సాగుతున్నాయి. సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా మేడారానికి లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో వారు పడేసిన చెత్తా చెదారం పేరుకుపోయింది. దీనిని తొలగించేందుకు పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం పనిచేస్తున్నారు. జాతర సమయంలో, జాతర అనంతరం మేడారానికి వస్తున్న భక్తులకు ఎక్కడ కూడా అపరిశుభ్రత, చెత్తాచెదారం కనిపించకుండా తొలగిస్తున్నారు. మేడారంతో పాటు పరిసర ప్రాంతాల్లో సైతం ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా రు. డీపీఓ వెంకయ్య సైతం దగ్గరుండి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తూ చెత్తాచెదారం తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు కావాల్సిన వసతులు కల్పిస్తూ మేడారాన్ని క్లీన్గా చేసి స్థానికులకు తిరిగి అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఏటూరునాగారం: ఏటూరునాగారం– మంగపేట మండలాల మధ్యలోని అటవీ ప్రాంతం నుంచి ప్రధాన రోడ్డుపైకి వచ్చి గాయపడి ఉన్న దుప్పిని అటవీశాఖ అధికారులకు పలువురు బాటసారులు అప్పగించారు. గురువారం ఉదయం జీడివాగు సమీపంలో వాహనాలు వెళ్తుండగా గాయపడిన దుప్పి కనిపించింది. దీంతో కమలాపురం గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు గడ్డి శ్రీనివాస్, వల్స శ్రీనివాస్, సృజన్, రాంబాబు మరికొంత మంది చూసి చలించారు. ఇదే క్రమంలో మరికొన్ని దుప్పులు కూడా రోడ్డు దాటుతుండగా లారీ ప్రమాదానికి గురికాకుండా కాపాడారు. గాయపడిన దుప్పిని ఏటూరునాగారం రేంజ్ కార్యాలయానికి తరలించి రామన్నగూడెం బీట్ అధికారి దయానంద్కు అప్పగించినట్లు వారు తెలిపారు. అటవీ జంతువులను కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారని అటవీశాఖ అధికారులు వారిని అభినందించారు.
బాలకుమారస్వామికి మంత్రి సీతక్క పూజలు
బాలకుమారస్వామికి మంత్రి సీతక్క పూజలు


