‘కాళేశ్వరం’ పక్షితీర్థంలో చరిత్ర జాడలు!
గోదావరి పుష్కరాలకు రూ.200 కోట్ల నిధులు..
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయ సమీప గోదావరి వద్ద పురాతన చరిత్ర జాడలను ఆర్కిటెక్చర్ బృందం కనుగొంది. గత నెల 28న హైదరాబాద్కు చెందిన ఆర్కిటెక్చర్ బృందం సభ్యులు గోదావరి వద్ద పక్షితీర్థాన్ని సందర్శించారు. 2027 జూలైలో నిర్వహించే గోదావరి పుష్కరాల నిధులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి పక్షితీర్థం (వీఐఫీ ఘాట్ ఎగువన) ప్రాంతంలో అన్వేషించారు. దీంతో చారిత్రక ఆనవాళ్లు బయటపడ్డాయి. పక్షులు నీరు తాగిన, స్నానం చేసిన, నీటిని తాకిన ఈ ప్రాంతాన్నే పక్షితీర్థం అంటారు.
కాళేశ్వరంలోని పక్షితీర్థం వద్ద పురాతన ఆనవాళ్లు వెలుగులోకి రావడంతో చరిత్రకారులు, ఆధ్యాత్మికవేత్తల్లో ఆసక్తి నెలకొంది. రాతితో చెక్కిన గుండ్రటి గోతులు (అవతలి మహారాష్ట్ర తీరం వరకు వ్యాపించినట్లు గుర్తింపు), నీరు ప్రవహించేలా ఏర్పాటు చేసిన కోనేరు కాల్వలు, మెట్ల మార్గం, శివలింగ ఆకృతిని తలపించే రాతి నిర్మాణాలు దర్శనమివ్వడంతో ఈ ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యం ఉందనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. పక్షితీర్థం పరిసరాల్లో ఒకదానికొకటి అనుసంధానంగా ఉన్న రాతిలో సొరంగం మార్గాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రాచీన కాలంలో నీటి నిర్వహణతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ కోసం ఇవి ఉపయోగించి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. కొన్ని గుంతల్లో ఇప్పటికీ నీరు నిల్వ ఉండడం గమనార్హం. ఈ ప్రాంతం శైవ సంప్రదాయానికి అనుబంధంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ కనిపిస్తున్న లింగాకృతులు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.
సహజరాతి నిర్మాణాలతోపాటు మానవ నిర్మిత ఆనవాళ్లు కలిసి ఉండడం వల్ల ఇది సాధారణ ప్రకృతి ఏర్పాటుకాదని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఈ విలువైన పురావస్తు సంపదపై పురావస్తు శాఖ శాసీ్త్రయ పరిశీలన చేపట్టి సంరక్షణ చర్యలు తీసుకుంటే పక్షితీర్థం ప్రాంతం ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశముందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. నిర్లక్ష్యం చేస్తే అరుదైన చరిత్ర ఆనవాళ్లు కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన నెలకొంది. ఈవిషయమై ఈఓ మహేశ్ను ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
రాతి సొరంగం, కోనేరు కాల్వలు,
లింగాకృతులు
వారం క్రితం కనుగొన్న
ఆర్కిటెక్చర్ బృందం
పురావస్తుశాఖ పరిశోధన జరిపితే
మరింత సమాచారం
ఇప్పటికే గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం రూ.200 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఆ నిధులతో క్షేత్రం అభివృద్ధితో పాటు పలు శాశ్వత నిర్మాణాలపై దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ దృష్టిసారించారు. మంథని ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సైతం ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వచ్చే మే 21 నుంచి జూన్1 వరకు సరస్వతినది అంత్యపుష్కరాలకు రూ.30.61 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు కలెక్టర్ రాహుల్శర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ నిధులతో చేపట్టే పనులపై చర్చలు జరుగుతున్నాయి.
‘కాళేశ్వరం’ పక్షితీర్థంలో చరిత్ర జాడలు!
‘కాళేశ్వరం’ పక్షితీర్థంలో చరిత్ర జాడలు!
‘కాళేశ్వరం’ పక్షితీర్థంలో చరిత్ర జాడలు!


