‘స్వయంభూ’ దర్శనభాగ్యం!
భక్తులకు సౌకర్యాలు
కల్పించిన ఆలయ కమిటీ
బుగులు వెంకన్న భక్తులకు నెరవేరిన చిరకాల స్వప్నం 650 మెట్లు ఎక్కితే కొండపై గుహలో స్వామి దర్శనం
చిల్పూరు: చిల్పూరుగుట్ట బుగులు వేంకటేశ్వరుడి దర్శనానికి వచ్చే భక్తులకు చిరకాల స్వప్నం నెరవేరింది. స్వయం భూవలయుడిగా వెలిసిన ప్రాంతమున్న కొండపైకి చేరుకునేందుకు మెట్ల మార్గం పూర్తయింది. 650 మెట్లు ఎక్కితే కొండ గుహలో వెలిసిన దేవుడిని దర్శనం చేసుకోవచ్చు. ఎత్తైన కొండపై గుహలో వెలిసిన స్వయం భూవలయని దర్శనం కోసం భక్తులు ఒకప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతూ వెళ్లేవారు. పైకి ఎక్కలేని భక్తులు కింది నుంచే దర్శనం చేసుకునేవారు. దీన్ని గమనించిన ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్రావు కొండపైకి మెట్ల మార్గం పూర్తి చేయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈవిషయాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే, భక్తుల సహకారంతో 650 మెట్లను పూర్తి చేయించారు. దీంతో పాటు లైట్లు, పలు సౌకర్యాలు కల్పించారు. గతంలో ప్రతీ శనివారం అర్చకుడితో పాటు ఒకరికి తోడుగా ఒకరు చేయిపట్టుకుని పైకి ఎక్కి దర్శనం చేసుకునేవారు. ప్రస్తుతం మెట్ల మార్గం పూర్తి కావడంతో భక్తులు ఇక నిత్యం కొండపైకి ఎక్కి స్వయం భూవలయున్ని దర్శించుకోవచ్చు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి, దేవాదాయ శాఖ, భక్తుల సహకారంతో మెట్ల మార్గం పూర్తి చేయించాను. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎంతో ఉత్సాహంగా కొండపైకి వెళ్లి దర్శనం చేసుకుంటున్నారు.
–పొట్లపల్లి శ్రీధర్రావు, చైర్మన్
స్వయం భూవలయున్ని దర్శించుకోవాలనే భక్తుల కోరిక మెట్ల మార్గం పూర్తి కావడంతో నెరవేరింది. ప్రస్తుతం మెట్లకు రంగులు, పైవరకు లైట్లు పూర్తి అయ్యాయి.
–భాగం లక్ష్మీప్రసన్న, ఈఓ
పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం మెట్ల మార్గం పూర్తయింది. కొండ గుహలో వెలిసిన దేవుని దర్శన భాగ్యం ప్రతీ ఒక్కరికి కలుగుతుంది. అల్వార్రాజులు, క్షేత్రపాలకులు, ఆంజనేయ స్వామి ఉండడం వల్ల భక్తులు కోర్కెలు నెరవేరుతాయి.
– రవీందర్శర్మ, ఆలయ అర్చకులు


