కేంద్ర నిధులతోనే అభివృద్ధి
● బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
జనగామ రూరల్: కేంద్ర నిధులతోనే సంక్షేమం, అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రెండేళ్లుగా రాష్ట్రంలో, జిల్లాలో 5 పైసల పనికుడా చేయలేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. ఆదివారం మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా పట్టణంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. నెహ్రూపార్కు ఏరియా, గిర్నిగడ్డ లేబర్ అడ్డా, సంజయ్ నగర్ చమాన్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక, బార్డర్లో ఎలాంటి తుపాకుల మోత లేదని దేశం మొత్తం ప్రశాంతంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయడంలో విఫలమైందన్నారు. పట్టణం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని ప్రజలు ఒక్క సారి ఆలోచించి బీజేపీకి అవకాశం ఇవ్వాలని అన్నారు. ఈకార్యక్రమంలో అభ్యర్ధులు మాచర్ల స్వరూప, కోట వినోద్,నాయకులు తదితరులు పాల్గొన్నారు.


