
మా ఊరిలో చాలా సమస్యలు ఉన్నాయి. రోడ్ల మరమ్మతు దగ్గర నుంచి శ్మశాన వాటికను ఆక్రమించే వరకు ఎన్నో సమస్యలపై సంబంధిత అధికారులకు అనేకమార్లు ఫిర్యాదు చేశాము. కానీ ప్రయోజనం లేదు. పిల్ దాఖలు చేస్తే బాగుంటుంది అని తెలిసిన వాళ్ళు సలహా ఇచ్చారు. ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయడానికి ఏం చేయాలి? తగిన సలహా ఇవ్వగలరు.
– రాఘవులు, అనకాపల్లి
సమాజంలో జరిగే వివిధ అన్యాయాలపై, అక్రమాలపై, ప్రభుత్వానికి – ప్రభుత్వ ఆస్తులకు, ప్రజాధనానికి, పర్యావరణానికి నష్టం కలిగించేటటువంటి అంశాలపై ప్రతి పౌరుడు హైకోర్టును, అలాగే సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించగలిగే హక్కు ప్రజాప్రయోజన వ్యాజ్యం ద్వారా కల్పించింది అత్యున్నత న్యాయస్థానం. సాధారణ కేసులలో అయితే మీకు, మీ కేసుకు సంబంధం ఏమిటి అని కోర్టుకు చెప్పవలసి ఉంటుంది. అలా చెప్పని పక్షంలో మీ కేసును కోర్టు పరిగణించవలసిన అవసరం లేదు. కానీ మీకు నేరుగా వ్యక్తిగత సంబంధం – లబ్ధి లేని అంశాలపై – ప్రజాప్రయోజనం ఉన్నది అని చూపించగలిగిన అంశాలపై పిల్ దాఖలు చేయచ్చు.
నిజానికి మీకు నేరుగా ఎటువంటి లబ్ధి లేదు అని కూడా కోర్టుకు అఫిడవిట్ సమర్పించ వలసి ఉంటుంది. అంతేకాక కేసు దాఖలు చేసే ముందు మీరు పూర్తిగా అధ్యయనం చేసిన విషయాన్ని నిర్ధారిస్తూ ఎలాంటి పరిణామాల మధ్య మీరు ఆ కేసు వేయవలసిన అవసరం వచ్చిందీ, అలాగే కేసుకు అయ్యే ఖర్చు మీరు భరిస్తున్నట్లు చెప్తూ మీ పాన్కార్డు నకలు కూడా సమర్పించవలసి ఉంటుంది. వీటన్నిటి వెనుక గల ఉద్దేశం: వ్యక్తిగత కారణాలవల్ల కాకుండా నిజమైన ప్రజాప్రయోజనం కోసం మాత్రమే మీరు కోర్టును ఆశ్రయించారు అని కోర్టు పరిశీలిస్తుంది.
పనిచేసే ప్రదేశాలలో స్త్రీలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం, 2013 రావడానికి కారణమైన ‘విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్’, రోడ్డు ప్రమాదాలు /ప్రాణాపాయం వంటి అత్యవసర సమయాలలో ΄ోలీసు వారి కోసం వేచి చూడకుండా హాస్పిటల్ వారు చికిత్స అందించాలి అని చెప్పిన ‘పరమానంద కట్టారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ వంటి ఎన్నో కేసులు కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యాల ద్వారా వచ్చినవే! ఇది ఒక బలమైన హక్కుగా మనకు రాజ్యాంగం – సుప్రీం కోర్టు కల్పించినవి.
ఇక మీ కేసుకి వస్తే. మీ సమస్యలన్నీ మీ గ్రామానికి సంబంధించినవి. అందులో మీకు నేరుగా లబ్ధి ఏమైనా ఉందా అనే విషయం చూడవలసిన అవసరం ఉంది. అయితే సరైన రోడ్లు లేక΄ోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నట్లయితే, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములలో /మీ ఊరి శ్మశాన వాటికలో ఆక్రమణలు జరుగుతున్నట్లు రుజువులు సేకరించినట్లయితే మీరు కూడా ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయవచ్చు. ప్రతి అంశానికి వేరు వేరు వ్యాజ్యాలు వేయాలా లేక కొన్ని అంశాలను కలిపి కోరవచ్చా అనేది కేసు పరిశీలించిన తర్వాత మాత్రమే చెప్పగలము.
మీకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి హైకోర్టు లాయరును సంప్రదించి వారి ద్వారా వ్యాజ్యం వేయడం లేదా మీరే సొంతంగా వ్యాజ్యాన్ని వాదించుకుంటాను అని ప్రత్యేక దరఖాస్తు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం. మీరు ఇదివరకే ప్రభుత్వ అధికారులకు సమర్పించిన అర్జీలను, మీ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లను, వీలైతే ఫోటోలు వీడియోలు తదితర కీలకపత్రాలను హైకోర్టుకు సమర్పించవలసి ఉంటుంది. హైకోర్టు మీ కేసును పరిశీలించిన తర్వాత సరైన న్యాయాన్ని కచ్చితంగా అందిస్తుంది.
(చదవండి: ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్: పెళ్లి పరీక్షకు ప్రిపేర్ అవ్వాలి)