ఫీజుల భారం.. చదువుకు దూరం
ఫీజు బకాయిలు విడుదల చేయాలి
ప్రభుత్వం చిన్నచూపు తగదు
గత వైఎస్సార్సీపీ పాలనలో అందించిన సాయం
ఏలూరు (టూటౌన్): విద్యకు ప్రభుత్వ సహకారం కొరవడటంతో పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితులు తలెత్తాయి. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. జిల్లాలో సుమారు రూ.200 కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. ఏడాదికి సగటున 40 వేల మంది విద్యార్థులకు ఫీజులు చెల్లించాల్సి ఉంది. గత, ప్రస్తుత విద్యాసంవత్సరాల్లో మొత్తంగా 80 వేల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కళాశాల యాజమాన్యాలు ఫీజులు చెల్లించని వారికి పరీక్షల్లో హాల్టికెట్లు ఇచ్చేది లేదనడం, మరోపక్క ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు చెల్లిస్తామంటూ కాలయాపన చేయడంతో విద్యార్థులు నలిగిపోతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ఫీజులు చెల్లిస్తున్నారు.
గత ప్రభుత్వంలో విద్యా విప్లవం
గత వైఎస్సార్సీపీ పాలనలో (2014–19) వరకు విద్యార్థులకు స్వర్ణయుగంగా చెప్పవచ్చు. పేదల విద్యార్థుల చదువులకు ప్రోత్సాహమిచ్చేలా ప్రభు త్వం జగనన్న విద్యా, వసతి దీవెనల పేరుతో పథకాలు అమలు చేసింది. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, డిప్లొమా వంటి కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందించి అండగా నిలిచింది. అలాగే వసతి దీవెన పేరుతో రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ ఆర్థిక సాయం అందించింది. ఇలా మొత్తంగా జిల్లాలో విద్యా దీవెన పథకం ద్వారా 1,75,118 మందికి రూ.450.77 కోట్లు, వసతి దీవెన పథకం ద్వారా 1,73,246 మందికి రూ.171.38 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చింది.
విద్యార్థుల మెడపై కత్తి
విద్యకు కొరవడిన ప్రభుత్వ సహకారం
జిల్లాలో రూ.200 కోట్ల మేర ఫీజు బకాయిలు
ఫీజులు చెల్లించాలంటూ యాజమాన్యాల ఒత్తిళ్లు
సుమారు 80 వేల మంది విద్యార్థులకు ఇబ్బందులు
గత ప్రభుత్వంలో రూ.622 కోట్ల మేర లబ్ధి
జిల్లావ్యాప్తంగా పేరుకుపోయిన ఫీజుల బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి. ఒక పక్క పరీక్షలు దగ్గరపడుతుంటే మరో పక్క ఫీజుల ఒత్తిడితో విద్యార్థులు మానసికంగా నలిగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు రాసి మంచి ఫ లితాలు సాధించాలంటే ఎలా సాధ్యం. ఇప్పటికై నా పాలకులు దీనిపై స్పందించి, పరీక్షల కన్నా ముందే ఫీజుల బకాయిలు చెల్లించాలి.
– కాకి నాని, జిల్లా అధ్యక్షుడు, పీడీఎస్యూ, ఏలూరు జిల్లా
పేదల చదువులపై చంద్రబాబు ప్రభుత్వం చిన్నచూపు చూడటం తగదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మా దిరిగా ప్రతి త్రైమాసికానికి బ కాయిలు విడుదల చేయాలి. దాని వల్ల విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే విద్యార్థుల చదువులకు కూటమి సర్కారు సహకారం కొరవడింది. ఇప్పటికైనా బకాయి పడ్డ నిధులు వెంటనే విడుదల చేయాలి.
– డి.శివకుమార్, అధ్యక్షుడు, అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్), ఏలూరు జిల్లా
సంవత్సరం జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన
విద్యార్థులు లబ్ధి (రూ.లలో) విద్యార్థులు లబ్ధి (రూ.లలో)
2019–20 36,527 95.78 కోట్లు 36,580 36.86 కోట్లు
2020–21 37,148 77.97 కోట్లు 37,750 35.76 కోట్లు
2021–22 38,677 105.67 కోట్లు 36,350 34.76 కోట్లు
2022–23 33,655 81.53 కోట్లు 32,316 30.96 కోట్లు
2023–24 29,111 67.35 కోట్లు 30,250 28.42 కోట్లు
మొత్తం 1,75,118 450.77 కోట్లు 1,73,246 171.38 కోట్లు
ఫీజుల భారం.. చదువుకు దూరం
ఫీజుల భారం.. చదువుకు దూరం


