
నియామకాలు నిలిచిపోవచ్చని మెజారిటీ అంచనా
జీనియస్ కన్సల్టెంట్స్ సర్వేలో వెల్లడి
ముంబై: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉద్యోగ నియామకాలపై ప్రభావం చూపించనున్నట్టు స్టాఫింగ్ సొల్యూషన్స్ అందించే జీనియస్ కన్సల్టెంట్స్ నివేదిక తెలిపింది. ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో మెజారిటీ ఉద్యోగులు తమ కంపెనీలు నియామకాలు నిలిపివేయొచ్చని లేదా తగ్గించుకోవచ్చని చెప్పారు. 2006 మంది ఉద్యోగులను ఈ ఏడాది మే 12 నుంచి జూన్ 6 మధ్య సర్వే చేసి వివరాలు విడుదల చేసింది.
→ సర్వేలో పాల్గొన్న వారిలో 63 శాతం మంది తమ కంపెనీలు మొత్తంగా నియామకాలను నిలిపివేయొచ్చని లేదా నియామకాలు తగ్గించుకోవచ్చని చెప్పారు.
→ కాంట్రాక్టు ఉద్యోగులు, ఫ్రీలాన్సర్ల నియామకం దిశగా తమ కంపెనీలు అడుగులు వేస్తున్నట్టు 15 శాతం మంది చెప్పారు.
→ తమ వేతనాల పెంపు, బోనస్లు, ప్రోత్సాహకాలపై భౌగోళిక అస్థిరతలు ప్రభావం చూపించొచ్చని 36 శాతం మంది అభిప్రాయపడ్డారు.
→ 21 శాతం మంది పని భారం పెరగనుందని ఆందోళన చెందారు.
→ అంతర్జాతీయ వ్యాపారం, పర్యటనలపై ప్రభావం పడుతుందని 22% మంది చెప్పారు.
→ బృంద ధైర్యం, విశ్వాసంపై ప్రభావం పడుతుందని 21 శాతం అభిప్రాయపడ్డారు.
→ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పట్ల తాము ఎంతో ఆందోళన చెందుతున్నామని, దీని తాలూకూ ఆరంభ హెచ్చరిక సంకేతాలు కనిపిస్తున్నట్టు 30 శాతం మంది చెప్పారు.