మసాజ్ పేరుతో స్పా సెంటర్ అసాంఘిక కార్యకలాపాలు
ఒక విద్యార్థి పేరెంట్కు 3 దఫాలుగా రూ.28 వేల పేమెంట్ మెసేజ్
రంగంలోకి దిగిన విద్యార్థి మేనమామ
ఆయన స్టింగ్ ఆపరేషన్తో వ్యవహారం బట్టబయలు
దీంతో పోలీసులతో బెదిరింపులకు ఒడిగట్టిన స్పా నిర్వాహకుడు
గుంటూరులో వెలుగుచూసిన దారుణం
కఠిన చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ వకుల్ జిందాల్
లక్ష్మీపురం (గుంటూరు వెస్ట్): అనంతపురంలో హనీట్రాప్ వ్యవహారం సంచలనం సృష్టించగా, గుంటూరులో ఒక స్పా సెంటర్ అసాంఘిక కార్యకలాపాలతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న వ్యవహారం తాజాగా వెలుగుచూసింది. బాధితులు సాక్షికి తెలిపిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లాలోని ఒక యూనివర్సిటీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి హాస్టల్ ఫీజు కోసం తల్లిదండ్రుల నుంచి రూ.28 వేల నగదు తీసుకున్నాడు. అయితే ఆ విద్యార్థి ఫోన్తో ‘పేమెంట్ సంబంధిత’ కనెక్షన్ ఉన్న అతని తల్లి ఫోన్కు ఈనెల 24న మూడు మెసేజ్లు వచ్చాయి.
ఒక స్పా సెంటర్లో మూడు దఫాల్లో రూ.28 వేలు చెల్లించినట్లు సూచిస్తున్న ఈ మెసేజ్ల గురించి తల్లి, కుటుంబ సభ్యులు విద్యార్థిని ప్రశ్నించగా, గుంటూరు బ్రాడీపేటలోని 4వ లైన్లో ఉన్న స్పా సెంటర్లో మసాజ్ కోసం ఇద్దరు స్నేహితులతో కలిసి వెళ్లిన తన నుంచి ఈ డబ్బు వసూలు చేసినట్లు చెప్పాడు. దీంతో ఈ వ్యవహారం గుట్టురట్టు చేయడానికి విద్యార్థి మేనమామ, విశ్రాంత ఆర్మీ జవాన్ రంగంలోకి దిగి ‘స్టింగ్ ఆపరేషన్’కు శ్రీకారం చుట్టారు. కస్టమర్ అవతారం ఎత్తి విద్యార్థి పేర్కొన్న స్పా సెంటర్కు వెళ్లారు.
మసాజ్కు వారు చెప్పిన రూ.3 వేలు చెల్లించాడు. లోపలగదిలోకి వెళ్ళడంతో ఓ అమ్మాయి మరో రూ.7 వేలు చెల్లించమని అడగింది. జవాన్ చెల్లించగానే ఆ యువతి తన శరీరంపై ఉన్న దుస్తులు తీయడం ప్రారంభించింది. దీంతో బయటకు వచ్చిన జవాన్, ఇక్కడ జరుగుతోంది ఏమిటంటూ... రిసెప్షన్లో ఉన్న స్పా సెంటర్ నిర్వాహకుడిని ప్రశ్నించారు. దీంతో తప్పయిపోయింది.. క్షమించమని నిర్వాహకుడు వేడుకున్నాడు. ఈ సందర్భంలో జవాను స్పా సెంటర్ ఉచ్చులోకి దిగిన ముగ్గురు విద్యార్థుల సంగతీ ప్రస్తావించారు. దీంతో తప్పయిదంటూ.. సమీపంలో ఉన్న బస్టాండ్ వద్ద వేచివుండాలని, తాము తీసుకున్న డబ్బు అంతా తిరిగి ఇచ్చేస్తానని నిర్వాహకుడు చెప్పాడు.
దీంతో కారులో బయలుదేరి వెళుతున్న ఆర్మీ జవాన్ను ఇద్దరు పోలీసులు, స్పా సెంటర్ నిర్వాహకుడు వెంబడిస్తూ వచ్చారు. స్పా సెంటర్ నిర్వాహకుడి ఫోన్ నుంచి జవాన్కు వీడియో కాల్ చేసి ‘మేము సైబర్ పోలీసులం. బ్రాడిపేటలోని స్పా సెంటర్లో వీడియోలు తీశారని ఓ యువతి మీపై ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును అరండల్ పేటకు పంపుతున్నాం. అక్కడికి వెళ్లండి’ అని చెప్పారు. దీనికి స్పందించిన జవాన్, ‘అరండల్ పేట సీఐ అనుమతితోనే తాము ఈ పని చేస్తున్నట్లు స్పా నిర్వాహకుడు చెబుతున్నాడు. అలాంటప్పుడు అరండల్పేట వెళ్లేది లేదు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తాం’ అని సమాధానం చెప్పారు. కాగా ఈ వ్యవహారంపై తగిన విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సాక్షికి తెలిపారు.


