
కూటమి సర్కారుపై మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం
కర్నూలులో కిలో ఉల్లి 3 రూపాయలు.. రూపాయిన్నరకే కిలో టమాటానా?
బిగ్ బాస్కెట్, ఇతర ఆన్లైన్ స్టోర్లలో మాత్రం కిలో ఉల్లి రూ.29 నుంచి రూ.32 దాకా విక్రయం
రైతులకు ధర దక్కడం లేదు.. బయట మాత్రం దిగి రావడం లేదు.. ఇవేం ధరలు..?.. రైతులు బతకొద్దా?.. తక్షణం పంటలు కొనుగోలు చేసి మానవత్వాన్ని చూపండి
కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం.. ఉన్నా లేనట్లే కదా!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్లే రాష్ట్రంలో రైతులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధరలు దక్కని దుస్థితిని ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్లే కదా? అని దెప్పిపొడిచారు.
కర్నూలులో ఉల్లి రైతులకు కిలో రూ.మూడు మాత్రమే దక్కుతుండగా బిగ్ బాస్కెట్, ఇతర ఆన్లైన్ స్టోర్లలో మాత్రం కిలో రూ.29 నుంచి రూ.32 దాకా విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. తక్షణమే రైతుల నుంచి పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేసి ప్రభుత్వం వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపాలని హితవు పలికారు. ఈమేరకు తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ మంగళవారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..
» చంద్రబాబు గారూ.. పంటల ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు..? రైతు అనేవాడు బతకొద్దా? కొన్ని వారాలుగా రైతులు లబోదిబోమంటున్నా మీరు కనికరం కూడా చూపడం లేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిరక్ష్యం చూపుతారా? ఇక ప్రభుత్వం ఉండి కూడా ఏం లాభం? ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్లే కదా?
» క్వింటా ఉల్లిని రూ.1,200 చొప్పున కొనుగోలు చేస్తామంటూ మీరు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. కానీ తూతూమంత్రంగా చేసి, అదే కర్నూలు మార్కెట్లో వేలం వేయించారు. ఎవరూ కొనడం లేదు.. ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసిన ప్రయత్నం కాదా ఇది? ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్, ఇతర స్టోర్లలో ఆన్లైన్లో పరిశీలిస్తే కిలో రూ.29 నుంచి రూ.32 దాకా ఎలా అమ్ముతున్నారు?
రైతు బజార్లో కూడా కిలో రూ.25కి తక్కువ అమ్మడం లేదు కదా? మరి రైతులకు ఎందుకు ధర రావడం లేదు? ఇది మీ తప్పు కాదా చంద్రబాబు గారూ? ఇంత జరుగుతున్నా రైతులను ఆదుకోవడానికి మీరు కనీసం దృష్టి పెట్టకపోడం అన్యాయం. అటు టమాటా ధరలు కూడా దారుణంగా పడిపోయినా పట్టించుకోవడం లేదు. కొనేవారు లేక పంటలను రోడ్డుమీదే పారబోస్తున్నారు. తక్షణం రైతుల పంటలను కొనుగోలుచేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపండి.