breaking news
Remunerative prices
-
సాగుకు ఊతం.. రైతుకు భరోసా
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో గడచిన పుష్కర కాలంలో దేశ వ్యవసాయ రంగం రూపురేఖలు మారిపోయాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేవలం రాయితీలు, సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా.. సాగును లాభసాటిగా మార్చే దిశగా కేంద్ర విధానాలు అమలయ్యాయని పేర్కొంది. బడ్జెట్ కేటాయింపుల పెంపు నుంచి మొదలుపెట్టి కనీస మద్దతు ధరల (ఎంఎస్పీ) సవరణ, మౌలిక వసతుల కల్పన, డిజిటల్ టెక్నాలజీ జోడింపు వరకు ప్రతి అడుగూ ఉత్పాదకతను పెంచేలా పడ్డాయని.... ఫలితంగా ఆహారధాన్యాల ఉత్పత్తిలో దేశం రికార్డులు సృష్టిస్తోందని కేంద్రం తెలిపింది. 2014 నుంచి 2026 వరకు వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వచ్చిన మార్పులు, సాధించిన ప్రగతిపై కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సమగ్ర నివేదిక విడుదల చేసింది. రెట్టింపైన వ్యవసాయ ఆదాయం గత పన్నెండేళ్లలో సాగు రంగానికి నిరంతర విధానపరమైన మద్దతు లభించింది. దీంతో మొత్తం స్థూల విలువ ఆధారిత (జీవీఏ)లో ఈ రంగం వాటా 18 శాతానికి చేరింది. 2014–15లో రూ.20.9 లక్షల కోట్లుగా ఉన్న వ్యవసాయ జీవీఏ.. 2023–24 నాటికి ఏకంగా రూ.48.7 లక్షల కోట్లకు పెరిగింది. పంటల విభాగం జీవీఏ సైతం రూ.12.92 లక్షల కోట్ల నుంచి రూ.26.52 లక్షల కోట్లకు చేరింది. 2013–14లో కేవలం రూ.27,663 కోట్లుగా ఉన్న వ్యవసాయ శాఖ బడ్జెట్ 2026–27 నాటికి రూ.1.40 లక్షల కోట్లకు చేరడం ఈ రంగం ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది. సిరులు పండిస్తున్న నేలఆహారధాన్యాల ఉత్పత్తిలో దేశం సరికొత్త రికార్డులు నమోదు చేసింది. 2013–14లో 26.50 కోట్ల టన్నుల ఆహారధాన్యాలు ఉత్పత్తి కాగా, 2024–25 నాటికి ఈ రికార్డు 35.77 కోట్ల టన్నులకు చేరింది. వరి ఉత్పత్తి 42 శాతం పెరిగి 15.01 కోట్ల టన్నులకు చేరుకోగా, ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా భారత్ నిలిచింది. గోధుమలు 11.79 కోట్ల టన్నులు, మొక్కజొన్న 4.34 కోట్ల టన్నులు, నూనెగింజలు 4.29 కోట్ల టన్నుల మేర ఉత్పత్తి సాధించాయి. ఉద్యానవన రంగం సైతం 36.90 కోట్ల టన్నుల ఉత్పత్తితో వ్యవసాయ వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. గిట్టుబాటుకు గ్యారెంటీపంటల ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం అదనంగా ఉండేలా ఎంఎస్పీని నిర్ణయిస్తూ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2014–2026 మధ్య కాలంలో వ్యవసాయ ఉత్పత్తుల ప్రభుత్వ సేకరణ 76 శాతం పెరిగి 122.92 కోట్ల టన్నులకు చేరింది. ఈ పుష్కర కాలంలో రైతులకు దక్కిన ఎంఎస్పీ విలువ రూ.26.32 లక్షల కోట్లు. 2014–15తో పోలిస్తే 2026–27 సీజన్కు రాగుల మద్దతు ధర అత్యధికంగా 236 శాతం పెరిగింది. వరి (సాధారణ రకం) మద్దతు ధర రూ.1,360 నుంచి రూ.2,441కి చేరింది. పత్తి రూ.3,750 నుంచి రూ.8,267కి చేరగా.. పప్పుదినుసులు, నూనె గింజల ధరల్లోనూ భారీ పెరుగుదల నమోదైంది.పెరిగిన రుణ లభ్యత రైతులకు సకాలంలో రుణాలు అందించేందుకు కిసాన్ క్రెడిట్ కార్డుల (కేసీసీ) ఖాతాలను 7.81 కోట్లకు పెంచారు. వ్యవసాయ రంగానికి సంస్థాగత రుణాలు 2013–14లో రూ.7.30 లక్షల కోట్లు ఉండగా, 2024–25 నాటికి ఈ మొత్తం రూ.28.67 లక్షల కోట్లకు చేరింది. ఫార్మ్ గేట్ వద్ద మౌలిక వసతుల కల్పనకు ఏఐఎఫ్ (వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి) కింద రూ.84,202 కోట్ల రుణాలను మంజూరు చేశారు. ఈ–నామ్ వేదికగా 1,656 మార్కెట్లను అనుసంధానించారు. మట్టి నాణ్యతను ధ్రువీకరించేందుకు ఇప్పటివరకు 26 కోట్ల సాయిల్ హెల్త్ కార్డులను జారీ చేశారు. పీఎం కుసుమ్ ద్వారా 21.77 లక్షల మంది రైతులకు సౌర పంపుసెట్లను అందించారు.లాభసాటిగా అనుబంధ రంగాలు సాంకేతికత జోడింపుతో వ్యవసాయం ఆధునికతను సంతరించుకుంటోంది. డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కింద 7.63 కోట్ల మంది రైతులకు ప్రత్యేక ఐడీలు సృష్టించారు. 23.5 కోట్ల పంట భూములను డిజిటైజ్ చేశారు. నమో డ్రోన్ దీదీ కింద వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. వ్యవసాయంతో పాటు పాడి, మత్స్య రంగాలు రైతులకు అదనపు ఆదాయ వనరుగా మారాయి. పాల ఉత్పత్తి 2024–25 నాటికి 247.87 మిలియన్ టన్నులకు చేరింది. మత్స్య సంపద ఉత్పత్తి 19.78 మిలియన్ టన్నులకు చేరుకుంది. వ్యవసాయ, ప్రొసెస్డ్ ఉత్పత్తుల ఎగుమతులు భారీగా పెరిగి 51.1 బిలియన్ డాలర్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వ నివేదిక పేర్కొంది. పెట్టుబడికి సాయం.. పంటకు రక్షణ.. రైతులకు పెట్టుబడి సాయం కింద పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఏటా రూ.6,000 చొప్పున అందిస్తున్నారు. ఇప్పటివరకు 22 విడతల్లో 9.44 కోట్ల కుటుంబాలకు రూ.4.28 లక్షల కోట్లను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతులను ఆదుకునేందుకు పీఎం ఫసల్ బీమా యోజన అండగా నిలుస్తోంది. ఏటా 4 కోట్ల మంది రైతులు పంటల బీమా చేయించుకుంటున్నారు. 2016 నుంచి డిసెంబర్ 2025 వరకు 24.31 కోట్ల మంది రైతులకు రూ.1.96 లక్షల కోట్ల మేర పరిహారం మంజూరైంది. -
పొగాకు రైతు ధర్మాగ్రహం
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు రీజియన్ పరిధిలో పొగాకు వేలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా మూడు మిలియన్ కేజీల ఉత్పత్తులూ ఇప్పటి వరకు కొనలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలే సరైన గిట్టుబాటు ధరలు లేక ఆవేదనలో ఉన్న రైతులు వేలం ప్రక్రియ ఆలస్యంతో మరింత నష్టాల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రైతులు ఎక్కడికక్కడ రోడ్డెక్కుతున్నారు. రోడ్లపై పొగాకు బేళ్లను పోసి తగలబెట్టి నిరసన తెలుపుతున్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధరలు కల్పించాలని, లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని హెచ్చరిస్తున్నారు. కర్ణాటక వేలం ముగియకపోవడం, అంతర్జాతీయంగా ఆర్డర్లు లేవనే సాకుతో వ్యాపారులు, పొగాకు కొనేందుకు ముందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కందుకూరు, కొండపి, టంగుటూరు, పొదిలి, కనిగిరి, వెల్లంపల్లి, ఒంగోలు 1 వేలం కేంద్రాల వద్ద రైతులు నిరసనలు తెలిపారు. రోడ్డుపై పొగాకు బేళ్లను వేసి తగలబెట్టారు. చంద్రబాబు పాలనపై కన్నెర్ర చేశారు. రెండు నెలలుగా ధరలు లేక నానా అగచాట్లు పడుతుంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు ఇదే విధంగా ఉంటే బ్యారన్కు రూ.5 లక్షల వరకు నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందారు.టీడీపీ నేత ఓవరాక్షన్ ఇదిలా ఉంటే రైతులకు మద్దతుగా వైఎస్సార్ సీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ సోమవారం కందుకూరులోని రెండో పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన సమయంలో టీడీపీ నేత, రైతు నాయకుడు తాటికొండ రమణయ్య ఓవరాక్షన్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వేలం కేంద్రంలో బుర్రా రైతులతో మాట్లాడుతున్న సమయంలో బోర్డు అధికారులు అక్కడికి చేరుకుని ప్రస్తుత మార్కెట్ పరిస్థితి గురించి వివరించే యత్నం చేశారు.స్పందించిన బుర్రా గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే బోర్డు తరఫున ఏం చర్యలు తీసుకున్నారు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటూ ప్రశ్నించారు. ఆ సమయంలో రమణయ్య ఇక్కడ బోర్డును నిందిస్తారేంటి అంటూ వ్యాపారులు, బోర్డుకు మద్దతుగా మాట్లాడుతూ రైతులను రెచ్చగొట్టే యత్నం చేశారు. వెంటనే స్పందించిన బుర్రా.. రమణయ్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతులకు అండగా నిలబడకుండా వ్యాపారులకు వంతపాడడంపై మండిపడ్డారు. దీంతో రైతులు కూడా రమణయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధరలు పెంచేలా చర్యలు తీసుకోవాలని, వ్యాపారులు వేలంలో పాల్గొని పొగాకు కొనేలా చూడాలని బుర్రా మధుసూదన్ డిమాండ్ చేశారు. -
ధరల పతనంలో బాబు ‘రికార్డు’
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వల్లే రాష్ట్రంలో రైతులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధరలు దక్కని దుస్థితిని ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్లే కదా? అని దెప్పిపొడిచారు. కర్నూలులో ఉల్లి రైతులకు కిలో రూ.మూడు మాత్రమే దక్కుతుండగా బిగ్ బాస్కెట్, ఇతర ఆన్లైన్ స్టోర్లలో మాత్రం కిలో రూ.29 నుంచి రూ.32 దాకా విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. తక్షణమే రైతుల నుంచి పంటలను మద్దతు ధరలకు కొనుగోలు చేసి ప్రభుత్వం వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపాలని హితవు పలికారు. ఈమేరకు తన ‘ఎక్స్’ ఖాతాలో వైఎస్ జగన్ మంగళవారం పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..» చంద్రబాబు గారూ.. పంటల ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు..? రైతు అనేవాడు బతకొద్దా? కొన్ని వారాలుగా రైతులు లబోదిబోమంటున్నా మీరు కనికరం కూడా చూపడం లేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిరక్ష్యం చూపుతారా? ఇక ప్రభుత్వం ఉండి కూడా ఏం లాభం? ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్లే కదా? » క్వింటా ఉల్లిని రూ.1,200 చొప్పున కొనుగోలు చేస్తామంటూ మీరు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. కానీ తూతూమంత్రంగా చేసి, అదే కర్నూలు మార్కెట్లో వేలం వేయించారు. ఎవరూ కొనడం లేదు.. ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసిన ప్రయత్నం కాదా ఇది? ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్, ఇతర స్టోర్లలో ఆన్లైన్లో పరిశీలిస్తే కిలో రూ.29 నుంచి రూ.32 దాకా ఎలా అమ్ముతున్నారు? రైతు బజార్లో కూడా కిలో రూ.25కి తక్కువ అమ్మడం లేదు కదా? మరి రైతులకు ఎందుకు ధర రావడం లేదు? ఇది మీ తప్పు కాదా చంద్రబాబు గారూ? ఇంత జరుగుతున్నా రైతులను ఆదుకోవడానికి మీరు కనీసం దృష్టి పెట్టకపోడం అన్యాయం. అటు టమాటా ధరలు కూడా దారుణంగా పడిపోయినా పట్టించుకోవడం లేదు. కొనేవారు లేక పంటలను రోడ్డుమీదే పారబోస్తున్నారు. తక్షణం రైతుల పంటలను కొనుగోలుచేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపండి. -
రాహుల్ రాష్ట్రానికి వస్తారు...
బెంగళూరు: గిట్టుబాటు ధరలు, పంటరుణాలు దక్కక ఇటీవల ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను పరమార్శించడానికి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ త్వరలో కర్ణాటక వ్యాప్తంగా పర్యటిస్తారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. బెంగళూరులోని పార్టీ కార్యాలయంలో కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్తో కలిసి శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని కారణాల వల్ల పర్యటన తేదీలు ఖరారు కాలేదని అయితే రాహుల్ గాంధీ పర్యటనపై త్వరలో స్పష్టత వస్తుందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం వైఫల్యాలు ఏడాదిలోపే తేటతెల్లమయ్యిందన్నారు. అనేక అక్రమాలకు పాల్పడిన లలిత్మోదీని ఎందుకు రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని ఈ సందర్భంగా బీజేపీ నాయకులను దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. బెంగళూరు నగరం అభివృద్ధి పథంలో పయనించాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. -
గుండె మండి ‘పంట’కు మంట!
పరిగి: రైతు ఉత్పత్తులకు గిట్టుబాటుధరలు కల్పించాలని రైతు కిసాన్సంఘ్ రాష్ట్ర కన్వినర్ అందె విజయ్కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబయ్య అన్నారు. శుక్రవారం రైతు కిసాన్సంఘ్ ఆధ్వర్యంలో పరిగి వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. పత్తి, మొక్కజొన్నలు తగులబెట్టి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయ మార్కెట్లో అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకు రైతుల ఉత్పత్తులకు ధరలు తగ్గుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటంలేదని ఆరోపించారు. సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం నామ్కే వాస్తేగా మారిందన్నారు. దళారులకే దన్నుగా నిలుస్తున్నారని తెలిపారు. పత్తికి రూ. 5000, వరికి రూ.1400, మొక్కజొన్నలకు రూ.1310 కి తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని తెలిపారు. దళారుల బారినుండి రైతులను రక్షించాలన్నారు. పరిగి వ్యవసాయ మార్కెట్లో తీవ్ర అవకతవకలు చోటుచేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవటంలేదన్నారు. అనావృష్టి కారణంగా ఈ సంవత్సరం నియోజకవర్గ రైతులు తీవ్ర నష్టం వచ్చిందని పేర్కొన్నారు. మద్దతు ధరలు పెంచి రైతులను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మార్కెట్లో రైతులకు తప్పనిసరిగా తక్పట్టీలు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తక్పట్టీలు ఇవ్వని కారణంగా రైతులు బీమా సౌకర్యం కోల్పోతున్నారని తెలిపారు. పత్తి కొనుగోలు కేంద్రం పరిగిలోనే ఏర్పాటు చేయటంతో పాటు తూకాలు కూడా ఇక్కడే నిర్వహించాలని కోరారు...ఈ కార్యక్రమంలో ఆయా రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.


