బోథ్ రేంజ్లో పులుల సంచారం
బోథ్: బోథ్ అటవీ పరిధిలోని గ్రామాల్లో పెద్దపులి, చిరుతల సంచారం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో అటవీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అటవీశాఖ అధికారి ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, ఇచ్చోడ ఎఫ్డీవో చిన్న విశ్వనాథ్ భూసిరెడ్డి సూచించారు. రెండు రోజుల క్రితం పుణ్యనాయక్ తండా గ్రామానికి చెందిన పవార్ సక్రు అనే వ్యక్తికి చెందిన ఆవుపై చిరుత దాడి చేసి చంపడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనపై ఆదిలాబాద్ డీఎఫ్వో ప్రశాంత్ బాజీరావు పాటిల్, ఇచ్చోడ ఎఫ్డీవో చిన్న విశ్వనాథ్ భూసిరెడ్డి మంగళవారం అటవీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకున్నారు. పులి, చిరుతల సంచారం నిర్ధారణ అయినందున ప్రజలు అడవుల్లోకి వెళ్లడం మానుకోవాలని, ముఖ్యంగా పంట పొలాలకు వెళ్లే రైతులు సమూహాలుగా మాత్రమే వెళ్లాలని అధికారులు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా అటవీ శివారు ప్రాంతాలకు వెళ్లకూడదని తెలిపారు. అలాగే, వన్యప్రాణుల రక్షణ దృష్ట్యా పొలాల చుట్టూ విద్యుత్ కంచెలు లేదా వలలు ఏర్పాటు చేయవద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పులి, చిరుతల దాడిలో పశువులను కోల్పోయిన రైతులకు ప్రభుత్వం తరఫున సకాలంలో పరిహారం అందేలా చూస్తామని ఈ సందర్భంగా అధికారులు భరోసా ఇచ్చారు.


