అంతుచిక్కని ఓటరు నాడి
గెలుపుపై ప్రధాన పార్టీల ధీమా లోలోన మాత్రం రెబల్ గుబులు ఇతర పార్టీలు, స్వతంత్రులు ప్రభావం చూపేనా?
ఎవరికి వారే ధీమా..
సాక్షి,ఆదిలాబాద్: మున్సిపల్ ఎన్నికల ఓట్ల పండుగ రానే వచ్చింది.. ప్రచారం ముగిసిన తర్వాత ప్రధాన పార్టీలు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ లోలోన మాత్రం వారికే సందేహాలు.. ప్రలోభాల పర్వంలో ఎక్కడా వెనుకబడకుండా ఓటరును ప్రసన్నం చేసుకున్నారు.. అలా గని నిశ్చింతగా ఉండని పరిస్థితి.. ఆ ఓటు తనకే పడుతుందా.. లేదా.. అనే సందేహం ప్రతీ అభ్యర్థిని వెంటాడుతోంది. ఓటరు నాడీపై అంచనాకు రాలేకపోతున్నారు. మాది అధికార పార్టీ.. మీ ఓటు ఇతర పార్టీలకు వేసి వృథా చేసుకోవద్దని కాంగ్రెస్ అంటుండగా, మున్సిపాలిటీలకు కేంద్రం నుంచి అనేక నిధులు రావడం జరుగుతాయని, అభివృద్ధి చేసి చూపిస్తామని బీజేపీ చెబుతోంది. తమ హయాంలోనే పట్టణ రూపురేఖలు మారాయని, మళ్లీ పట్టం కడితే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని బీఆర్ఎస్ ఓటర్లకు భరోసానిస్తోంది. మున్సిపాలిటీలో పార్టీ ప్రాతినిధ్యం ఉంటేనే మన వార్డుల్లో అభివృద్ధి పనులు చేసుకోగలుగుతామని ఎంఐఎం చెబుతోంది. గతంలో చైర్ పర్సన్గా బల్దియా అభివృద్ధికి తో డ్పాటునందించామని, ప్రత్యేక ప్యానల్తో బరిలో దిగిన తమను ఆదరిస్తే ఆ అనుభవంతో పట్టణ అభివృద్ధికి కృషి చేయనున్నట్లుగా ఏఐఎఫ్బీ పార్టీ స్పష్టం చేస్తుంది. ఇండిపెండెంట్గా బరిలోకి దిగిన తమను గెలిపిస్తే వార్డుల్లో క్రమ పద్ధతిగా అభివృద్ధి పనులు చేపడతామని స్వతంత్ర అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఓటరు ఏ అభ్యర్థి వైపు మొగ్గు చూపుతాడో అర్థం కాని పరిస్థితి. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను జనవరి 27న రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. జిల్లాలో ఏకై క మున్సిపాలిటీ ఆదిలాబాద్లోని 49 వార్డుల ఎన్నిక కోసం 28న నోటిఫికేషన్ జారీ కావడం, అదేరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. ఆ తర్వా త ప్రచారం మొదలుపెట్టారు. 9తో ఈ ప్రక్రియ ముగిసింది. నేడు పోలింగ్ జరగనుండగా, ఈనెల 13న ఓట్ల లెక్కింపు, వెంటనే ఫలితాల వెల్లడి, 16న మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక జరగనుంది. నేడు నిర్వహించనున్న కీలక ఘట్టంపైనే అందరి దృష్టి నెలకొంది.
స్వతంత్రుల ప్రభావమెంత..
ఈ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల నుంచి స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇందులో ప్రధాన పార్టీల నుంచి టికెట్ను ఆశించి భంగపడ్డ వారు కొందరు ఉన్నారు. వారు ఆయా ప్రధాన పార్టీలకు రెబల్గా బరిలో నిలిచారు. ఓట్లను చీల్చ డం ద్వారా తమ పార్టీ అభ్యర్థి గెలుపుపై వారు ప్రభావం చూపుతారా అనే సందేహం ఆయా పార్టీ ల్లో వ్యక్తమవుతుంది. పార్టీ ఆదేశాలు ధిక్కరించి బరిలో నిలిచిన వారు ఒకవేళ గెలిస్తే తమ నిర్ణయంపై వేలెత్తి చూపేందుకు ఆస్కారం ఉంటుందని ముఖ్య నేతల్లో ఆందోళన కూడా కనిపిస్తోంది. ఒకవేళ మెజార్టీకి కొంత అటూ ఇటుగా ఉండి, స్వతంత్ర అభ్యర్థులుగా రెబల్స్ గెలిచిన పక్షంలో వారు తమ పార్టీకి అనువుగా ఉంటారా.. లేదా అనే సందేహాలు కూడా లేకపోలేదు. మొత్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఆసక్తికరంగా మారింది.
ఈ ఎన్నికల్లో చైర్పర్సన్ పీఠం కై వసం చేసుకోవడం ఖాయమని ప్రధాన పార్టీలు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలు మెజార్టీ సాధించడం ఖాయమంటున్నాయి. తాము పూర్తిస్థాయిలో సత్తా చూపుతామని బీఆర్ఎస్ చెబుతోంది. ఈ ఎన్నికల్లోనూ తమ పార్టీ మంచి ఫలితాలు సాధించి పాలకవర్గం ఏర్పాటులో కీలకమవుతుందని ఎంఐఎం పేర్కొంటోంది. అధికార ప్రతిపక్ష పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, తమ ప్యానల్ను జనాల్లో ఆదరిస్తున్నారని ఏఐఎఫ్బీ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. మొత్తంగా ఫలితాలు ఎలా ఉంటాయనేది అందరు ఆసక్తిగా గమనిస్తున్నారు.


