దేశీయంగా ఐవోసీ ట్రేడింగ్‌ డెస్క్‌

Crude oil futures fall on weak global cues - Sakshi

స్పాట్‌ మార్కెట్లో ముడి చమురు కొనుగోలుకు ఏర్పాట్లు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి రియల్‌ టైమ్‌ ప్రాతిపదికన ముడిచమురును కొనుగోలు చేసే దిశగా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) దేశీయంగా ఢిల్లీలో ట్రేడింగ్‌ డెస్క్‌ను ఏర్పాటు చేసింది. నాణ్యమైన ముడిచమురును మెరుగైన ధరకే దక్కించుకోవడం ద్వారా దిగుమతి వ్యయాలను తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) ఎ.కె.శర్మ తెలిపారు. ఐవోసీ ప్రస్తుతం తమ అవసరాల్లో 30 శాతాన్ని (15 మిలియన్‌ టన్నుల) స్పాట్‌ మార్కెట్‌ నుంచి కొనుగోలు చేస్తోంది.

ఇందుకోసం 2017లో సింగపూర్‌లో ప్రత్యేక ట్రేడింగ్‌ ఆఫీస్‌ను ఏర్పాటు చేసింది. తాజాగా కంపెనీ అంతర్గతంగా ట్రేడింగ్‌ టీమ్‌ను, సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసుకున్న నేపథ్యంలో దేశీయంగానూ డెస్క్‌ను ప్రారంభించింది. గత నెల 25న తొలి ట్రేడ్‌ కింద నైజీరియాలో ఉత్పత్తయ్యే అగ్బామి రకం క్రూడ్‌ పది లక్షల బ్యారెల్స్‌ను కొనుగోలు చేసింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వంటి ప్రైవేట్‌ సంస్థలకు దేశీయంగా ట్రేడింగ్‌ డెస్క్‌లు ఉన్నప్పటికీ.. ప్రభుత్వ రంగంలో మాత్రం ఇలాంటిది ఏర్పాటు చేసిన మొదటి సంస్థ ఐవోసీనే. సింగపూర్‌ డెస్క్‌లో క్రూడ్‌ కొనుగోలుకు బిడ్స్‌ రావడం, నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి రెండు గంటల దాకా పట్టేస్తుండగా.. దేశీ డెస్క్‌ ఏర్పాటుతో ఎప్పటికప్పుడు మారే ధరలపై తక్షణమే బేరసారాలు చేసి, వెంటనే నిర్ణయం కూడా తీసుకునే వెసులుబాటు ఉంటుందని ఐవోసీ  పేర్కొంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top