కలిసిరాని అదృష్టం!
● మెజార్టీ ఉన్నా రాముకు దక్కని చైర్మన్ పీఠం
● మారిన రాజకీయ సమీకరణాలతో చేజారిన పదవి
ఆమనగల్లు: బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించిన 5వ వార్డు కౌన్సిలర్ పాపిశెట్టి రాముకు పదవి చేజారింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వ్యూహంతో ఆయనకు నిరాశే మిగిలింది. ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ సంఘ సేవకుడిగా పేరొందిన పాపిశెట్టి రాము తొలిసారి ఎన్నికల బరిలో దిగి భారీ విజయం సాధించినప్పటికీ, అదృష్టం కలిసిరాలేదు. బీఆర్ఎస్లో చేరిన పాపిశెట్టి రామును ముందుగానే చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. ఎన్నికల్లో 15 వార్డులకు గాను బీఆర్ఎస్ 8 వార్డులు, బీజేపీ 6, కాంగ్రెస్ ఒక వార్డులో విజయం సాధించాయి. చైర్మన్ పదవికి పూర్తిస్థాయి మెజార్టీ రావడంతో పాపిశెట్టి రాము చైర్మన్ అవుతారని అందరూ భావించారు. వేగంగా మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య సయోధ్య కుదరడంతో రాముకు పదవి దక్కకుండాపోయింది. దీనికితోడు బీఆర్ఎస్ నుంచి గెలిచిన కౌన్సిలర్ పత్యానాయక్ కాంగ్రెస్లో చేరడం, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఎక్స్ అఫీషియో ఓటు, బీజేపీ మద్దతుతో ఆమనగల్లు చైర్మన్ పీఠం కాంగ్రెస్కు దక్కింది. పూర్తిస్థాయి మెజార్టీ ఉన్నప్పటికీ రాముకు చైర్మన్ పదవి దక్కకపోవడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. చైర్మన్ పదవి లేకపోయినా, నిరంతరం ప్రజలలో ఉంటూ సేవ చేస్తానని రాము ప్రకటించారు.


