ఫలితాలపై ఉత్కంఠ
● గెలుపోటములపై జోరుగా చర్చ
● ఎవరి అంచనాలు వారివే
● నేడు మున్సిపల్ ఓట్ల లెక్కింపు
కొడంగల్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బుధవారం పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఆయా పార్టీల అభ్యర్థులు అంచనాల్లో మునిగిపోయారు. విజయం వరిస్తుందో లేదోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. విజయంపై అయోమయం నెలకొందని పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అయినా ఎవరి అంచనాల్లో వారున్నారు. కొడంగల్ మున్సిపల్ పరిధిలో 12 వార్డులు ఉన్నాయి. 34 మంది అభ్యర్థులు పోటీ చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలో 75 శాతం పోలింగ్ జరిగింది. 11,565 మంది ఓటర్లు ఉండగా అందులో 8,760 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 4,369 మంది పురుషులు, 4,391 మంది మహిళలు ఓటు వేశారు.
బరిలో 34 మంది
కొడంగల్ మున్సిపల్ బరిలో 34 మంది అభ్యర్థులు ఉన్నారు. 12 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, 9 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు, ఇద్దరు బీజేపీ అభ్యర్థులు, ఇద్దరు ఎంఐఎం, ఒకరు సీపీఐ(ఎమ్), 8 మంది స్వతంత్రులు పోటీలో ఉన్నారు. మొదటి వార్డులో జగదీశ్వర్రెడ్డి(కాంగ్రెస్), గుల్షన్(ఎవఐఎవ), రెండో వార్డులో ఊట్కూర్ మంజుల(కాంగ్రెస్), వాణిశ్రీ యాదవ్ (బీఆర్ఎస్), మూడో వార్డులో గొల్ల లక్ష్మమ్మ(కాంగ్రెస్), సోన (బీఆర్ఎస్), నాలుగో వార్డులో నందారం ప్రశాంత్ (కాంగ్రెస్), బాల్రాజ్ (బీఆర్ఎస్), ఐదో వార్డులో బాలమ్మ (కాంగ్రెస్), శ్యామమ్మ (బీఆర్ఎస్), ఆరో వార్డులో సయ్యద్ హమీద్ అలీ (కాంగ్రెస్), గంటి సురేష్కుమార్ సీపీఐ(ఎం), పవన్కుమార్ లాహోటీ, మహ్మద్ అలీ స్వతంత్ర అభ్యర్థులు, ఏడో వార్డులో కష్ణంరాజు (కాంగ్రెస్), మహేష్ బాబు (బీజేపీ) కె.వెంకటయ్య (స్వతంత్ర), 8వ వార్డులో శంకర్ (కాంగ్రెస్), కిషన్ (బీఆర్ఎస్), పూజ, వనితా స్వతంత్ర అభ్యర్థులు. 9 వార్డులో గంట మంజుల (కాంగ్రెస్), అమీనా బేగం (బీఆర్ఎస్), సన ఆప్రీనా (ఎంఐఎం), 10వ వార్డులో రాజశేఖర్ (కాంగ్రెస్), చంద్రశేఖర్ (బీఆర్ఎస్), 11వ వార్డులో అనిత (కాంగ్రెస్), మంజుల (బీఆర్ఎస్), లక్ష్మీ (బీజేపీ), 12వ వార్డులో సుష్మ (కాంగ్రెస్), లలిత (బీఆర్ఎస్), అంజిలమ్మ, బుడ్డ శ్రావణి, మాల శ్రావణి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందో చూడాలి.


