ఆ చట్టాలను రద్దు చేయాల్సిందే
అనంతగిరి: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు కార్మిక వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మైపాల్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం వికారాబాద్లో సీఐటీయూ, బీఆర్టీయూ, ఐఎఫ్టీయూ, ఏఐటీయూసీ, ఏఐకేఎస్, ఇద్వా, ఏఐకేఎంఎస్ కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. వీబీజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలన్నారు. విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. జీహెచ్ఎంసీ, పంచాయతీ, మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. భవన నిర్మాణ, హమాలీ, ట్రాన్స్పోర్టు కార్మికులకు రూ.10వేల పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, సీపీఐ కార్యదర్శి గోపాల్రెడ్డి, పీఓడబ్ల్యూ రాష్ట్ర నాయకురాలు గీత, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి మహేందర్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుదర్శన్, ఐద్వా జిల్లా కార్యదర్శి అనసూయ, కేవీపీఎస్ జిల్లా నాయకులు నవీన్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మైపాల్


