నయా నిజాంలా రేవంత్రెడ్డి పాలన
మొయినాబాద్: తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నయా నిజాంలా వ్యవహరిస్తున్నారని.. అధికారం ఉందని విర్రవీగితే ప్రజలు కాలగర్భంలో కలిపేస్తారని బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని అప్పోజీగూడ, చిలుకూరు వార్డుల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం హిమాయత్నగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్రెడ్డి భాష మార్చుకోవాలని హితవు పలికారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే తీవ్ర పదజాలంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముస్లిం ఓట్లకోసం మతపరమైన అంశాలను ముందుకు తీసుకొస్తున్నారన్నారు. పదేళ్లు కేసీఆర్ నియంత పాలనతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇస్తే రేవంత్రెడ్డి అంతకు మించి అవినీతి, భూదందాలకు తెరలేపారని ఆరోపించారు. దేశంలో మోదీ పాలన చూసి తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, ఎన్నికల ఇన్చార్జి సారిక చౌదరి, పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్గౌడ్, రాష్ట్ర నాయకులు కంజర్ల ప్రకాష్, సన్వెల్లి ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు.
బీజేపీ ఓబీసీ సెల్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్


