ఎర్రచందనం పరిరక్షణే లక్ష్యం
తిరుపతి అన్నమయ్యసర్కిల్: శేషాచల అడవుల్లో ఎర్రచందనం చెట్ల పరిరక్షణే లక్ష్యంగా రెడ్ శాండిల్ ప్రొటెక్షన్ సెల్ (ఎర్రచందనం పరిరక్షణ విభాగం) ఏర్పాటు చేశామని, వాటి పరిరక్షణకు సంబంధించి అటవీశాఖ సిబ్బంది పనితీరును మరింత పెంచేదిశగా చర్యలు చేపట్టినట్లు నోడల్ అధికారి రామకొండారెడ్డి తెలిపారు. ఈ విభాగంలో పీలేరు ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్ఓ, అన్నమయ్య డివిజన్ ఎస్ఆర్వో, తిరుపతి డివిజన్ ఎస్ఆర్వో, పీలేరు, తిరుపతి ప్లయింగ్ స్క్వాడ్ ఎస్ఆర్వోలు, టాస్క్ ఫోర్స్ ఏసీఎలు ఉంటారన్నారు. సీసీఎఫ్ సెల్వం ఆధ్వర్యంలో నోడల్ అధికారిగా తన పర్యవేక్షణలో ప్రొటెక్షన్ సెల్ పనిచేస్తుందన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు టాస్క్ఫోర్స్ సిబ్బంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్న అడవుల్లోకి స్మగ్లర్లు ప్రవేశించడం, ఎరచ్రందనం చెట్లను నేలకూల్చడం వంటి ఆగడాలకు కళ్లెం వేస్తున్నట్లు తెలిపారు. శాండిల్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా స్మగ్లర్లు ఎరచ్రందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడితే ప్రాంతంలో పనిచేసే సిబ్బందిని బాధ్యులుగా చేస్తామన్నారు. సిబ్బంది పనితీరు మార్చుకోకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. అటవీశాఖ సిబ్బంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ రోజూ కూంబింగ్, పెట్రోలింగ్ చేయడం వంటి చర్యలు చేపడతారన్నారు. ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లోని మేధావులు, విద్యావంతులు, స్థానికులు ఎర్రచందనం అక్రమ రవాణాను గుర్తించి కచ్చితమైన (నిజమైన) సమాచారం అందించాలన్నారు. వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. తద్వారా శేషాచలం అడవుల్లోని వృక్ష సంపదను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా స్వీకరిద్దామని పిలుపునిచ్చారు.
చైన్నెలో ఎన్ఎం కండ్రిగ పాఠశాల విద్యార్థి
తడ: మండలంలోని మాంబట్టు పంచాయతీ, ఎన్ఎం కండ్రిగ గ్రామానికి చెందిన నాలుగో తరగతి విద్యార్థి శ్రీనివాసతేజ సోమవారం చైన్నె మహానగరంలోని బీచ్ రైల్వే స్టేషన్ వద్ద ఆర్పీఎఫ్ సిబ్బందికి కనిపించాడు. వివరాల్లోకి వెళితే.. ఎన్ఎంకండ్రిగ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదివే శ్రీనివాసతేజ తల్లిదండ్రులు కర్ణాటకలో ఉండడంతో గ్రామంలోని మేనమామ శరత్ ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. చదువుతోపాటు ఇతర విషయాల్లోనూ చురుగ్గా ఉండే శ్రీనివాసతేజ సోమవారం పాఠశాలకు వచ్చి సెలవు కావడంతో స్కూల్ యూనిఫామ్తోనే తడలో మెమూ రైలు ఎక్కి చైన్నెకి చేరుకున్నాడు. రైల్వేస్టేషన్ వద్ద అనుమానాస్పద స్థితిలో ఆర్పీఎఫ్ సిబ్బంది కంట పడడంతో విచారించి బాలుడి కుటుంబానికి సమాచారం తెలిపారు.


