రఘుపై ఉన్న కేసుల వివరాలివ్వండి: హై​​​‍కోర్టు | TS HC Asks To DGP Over Details Of Journalist Raghu Case | Sakshi
Sakshi News home page

రఘుపై ఉన్న కేసుల వివరాలివ్వండి: హై​​​‍కోర్టు

Jun 10 2021 12:57 PM | Updated on Jun 10 2021 12:57 PM

TS HC Asks To DGP Over Details Of Journalist Raghu Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జర్నలిస్టు రఘుపై నమోదైన కేసుల వివరాలు వారి కుటుంబ సభ్యులకు ఈనెల 14లోగా ఇవ్వాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఒక కేసు తర్వాత మరో కేసు పెడుతున్నారని, ఈ నేపథ్యంలో రఘుపై ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పేలా ఆదేశించాలని కోరుతూ ఆయన భార్య గంజి లక్ష్మీ ప్రవీణ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు.

ఒక కేసులో బెయిల్‌ తీసుకుంటే మరో కేసులో ఆయన అరెస్టును చూపించి ఎక్కువ కాలం జైలులో ఉంచేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని పిటిషనర్‌ తరఫున న్యాయవాది రజినీకాంత్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో అన్ని కేసుల వివరాలను తెలియజేస్తే బెయిల్‌ కోసం ఆయా కోర్టులను ఆశ్రయిస్తామన్నారు.

కేసుల వివరాలివ్వాలని వినతిపత్రం సమర్పిస్తే ఇస్తామని ప్రభుత్వ తరఫు న్యాయవాది నివేదించారు. అయితే వినతిపత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని, ఈనెల 14లోగా రఘుపై ఎక్కడెక్కడ కేసులు నమోదు చేసింది తెలియజేయాలని డీజీపీని ఆదేశిస్తూ విచారణను ఈనెల 16కు వాయిదావేశారు.
చదవండి: చేతబడి కలకలం: ఉదయం లేచి చూస్తే మనిషి అదృశ్యం!

Advertisement
 
Advertisement
Advertisement