తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ?

Telangana Govt Planning to Impose Night Curfew - Sakshi

హైదరాబాద్:  దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. తెలంగాణలో కూడా కొన్ని వారాలుగా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడి కోసం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే లాక్‌డౌన్ విధించే అవకాశం లేదని స్పష్టం చేసింది. అయితే కరోనా నియంత్రణకు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగానే రాత్రిపూట కర్ఫ్యూ విధించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 

ఇటీవల అన్ని రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన వీడియో సమావేశంలోనూ కరోనా కట్టడి కోసం రాత్రిపూట కర్ఫ్యూలు అమలు చేయాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. దీంతో అనేక రాష్ట్రాలు ఆ దిశగా నిర్ణయాలు కూడా తీసుకున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ లాంటి రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి. ఇప్పడు అదే దారిలో తెలంగాణలో కూడా రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్ని శాఖల ముఖ్య అధికారులతో సమీక్షిస్తున్నారు. అన్ని శాఖల అధికారులతో సీఎం కేసీఆర్‌ సమావేశమవుతారని.. ఈ భేటీలోనే సీఎం కేసీఆర్ దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

చదవండి: కరోనా కలకలం: రికార్డు స్థాయిలో కేసులు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top