పుట్టపర్తి/హిందూపురం టౌన్: జిల్లాలో శుక్రవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జిల్లాలో అన్ని ప్రభుత్వ యాజమాన్యాల కింద 2,025 పాఠశాలలు ఉండగా అందులో 1,25,500 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి 1,70,000 పాఠ్య పుస్తకాలు అవసరం ఉంది. గత ప్రభుత్వంలో పేద విద్యార్థులపై భారం కాకుండా పాఠ్య పుస్తకాలతో పాటు నోటు పుస్తకాలు, వర్కు పుస్తకాలు ఉచితంగా అందించారు. పేద కుటుంబాలకు భరోసా కల్పించారు. అయితే, చంద్రబాబు సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికీ పూర్తి స్థాయిలో పుస్తకాలు సరఫరా చేయలేదు. విద్యార్థులకు షూ, యూనిఫాం అందించేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించకపోవడం గమనార్హం. కార్పొరేట్ విద్యా సంస్థలకు ప్రయోజనం చేకూరే విధంగా ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
చేరేవారేరీ..?
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చివేశారు. పాఠశాలల ప్రారంభానికి ముందే పాఠ్య పుస్తకాలతో పాటు షూ, యూనిఫాం, ‘అమ్మ ఒడి’ అందించారు. దీంతో అప్పట్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు బాగా చేరేవారు. నేడు చంద్రబాబు ప్రభుత్వంలో ప్రోత్సాహం కరువై ప్రభుత్వ బడులలో చేరేవారు కనిపించడం లేదు. అమడగూరు మండలంలోని ఏటిగడ్డ తండా, కొలిమిరాళ్లపల్లి, లోకోజుపల్లి గ్రామాల్లోని 3 పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో ఒక్క కొత్త అడ్మిషన్ కూడా నమోదు కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్లలో జిల్లాలో 50కి పైగా పాఠశాలలు మూతపడడం గమనార్హం.
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
ఇప్పటికీ పాఠ్య పుస్తకాలు, స్కూల్ కిట్లు అందించని చంద్రబాబు సర్కార్
ప్రైవేటులో ఫీజుల మోతతో భయాందోళన
చెందుతున్న తల్లిదండ్రులు
విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవాలి
జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో పెద్ద మొత్తంలో ఫీజులను వసూలు చేస్తున్నారు. పాఠశాలలో ఫీజుల వసూలు దందాలా మారిపోయింది. ఫీజులపై ఎలాంటి నియంత్రణ లేదు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చాలా వాటిలో మౌలిక సదుపాయాలు కూడా లేవు. పాఠశాలల ఆవరణలోనే పుస్తకాలు, విద్యా సామగ్రిని విక్రయిస్తున్నారు. విద్యాశాఖాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలి. – బాబావలి, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు


