లేపాక్షిలో ట్రైనీ కలెక్టర్లు | - | Sakshi
Sakshi News home page

లేపాక్షిలో ట్రైనీ కలెక్టర్లు

Jun 12 2026 7:13 AM | Updated on Jun 12 2026 7:13 AM

లేపాక్షి: లేపాక్షిలో వెలసిన వీరభద్రస్వామిని గురువారం అసిస్టెంట్‌ కలెక్టర్లు సీహెచ్‌ శ్రవణ్‌కుమార్‌రెడ్డి, హరిఓం పాండ్య, క్షితిజ్‌ ఆదిత్య శర్మ, నమ్రత అగర్వాల్‌, ఏఆర్‌.పవన్‌తేజ్‌, ప్రియా, సుయాష్‌కుమార్‌, బి.వెంకటేష్‌ దర్శించుకున్నారు. ఆలయంలో దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి ప్రత్యేకంగా పూజలు చేశారు. ఆలయ విశిష్టతను తెలుసుకున్నారు. ఆలయకమిటీ చైర్మన్‌ పరిగి వేణుగోపాల్‌రావు అసిస్టెంట్‌ కలెక్టర్లను సత్కరించారు. తహసీల్దార్‌ సౌజన్యలక్ష్మి, దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌, ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి తదితరులు ఉన్నారు.

విమానాశ్రయాల్లో ఉద్యోగావకాశాలు

ప్రశాంతినిలయం: జిల్లాలోని యువతీ యువకులకు విమానాశ్రయాల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌ పేర్కొన్నారు. హిందూపురం సమీపంలోని రక్షా అకాడమీ ఆధ్వర్యంలో ప్రధాన విమానాశ్రయాలు, పవర్‌ ప్రాజెక్టులు, టోల్‌ ప్లాజాల వద్ద సెక్యూరిటీ ఉద్యోగాలకు నెల రోజుల పాటు ప్రొఫెషనల్‌ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉచిత భోజనం, వసతి కల్పిస్తారన్నారు. పది ఆపైన చదివి, 18 నుంచి 30 ఏళ్లలోపు మహిళలు, 18 నుంచి 35 ఏళ్ల లోపు పురుషులు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 6281557937, 6300676517 నంబర్లలో సంప్రదించాలన్నారు.

వైఎస్సార్‌సీపీ నాయకుడిపై టీడీపీ మూకల దాడి

కదిరి టౌన్‌/గాండ్లపెంట: వైఎస్సార్‌సీపీ నాయ కుడిపై టీడీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. అందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గాండ్లపెంట మండల కేంద్రంలో ఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాలు సమీపంలోని సర్వే నంబరు 901లో 1.80 ఎకరాల భూమి తమ పెద్దల పేరుతో ఉందని గాండ్లపెంటకు చెందిన వైఎస్సార్‌ సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి నరసింహగౌడ్‌ ఆర్డీఓ కోర్టులో కేసు వేశారు. ఈ విషయంపై మాట్లాడాలంటూ గురువారం టీడీపీ నాయకుడు రహంతుల్లా నరసింహ గౌడ్‌ను భూమి వద్దకు పిలిపించాడు. తన వర్గీయులతో కలిసి అతనిపై దాడి చేశాడు. గాయపడిన అతడిని స్థానికులు కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడిని వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్‌ మక్బూల్‌ పరామర్శించారు. టీడీపీ మూకల దాడిని ఖండించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లింగాల లోకేశ్వర్‌రెడ్డి, పంచాయతీ వింగ్‌ కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీ కార్యకర్త

హత్య కేసులో నిందితుడి అరెస్టు

చిలమత్తూరు: మండల పరిధిలోని భూమయ్యగారిపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త రామకృష్ణప్పను కొడవలితో నరికి చంపిన శివప్పను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం స్థానిక పోలీసు స్టేషన్‌లో సీఐ జనార్దన్‌, ఎస్‌ఐ శ్రీధర్‌ వివరాలు వెల్లడించారు. భూమయ్యగారిపల్లిలోని సర్వే నంబరు 66 భూమి విషయంలో శివప్ప, రామచంద్రప్ప మధ్య చాలారోజులుగా వివాదం నెలకొంది. దీంతో రామచంద్రప్పపై శివప్ప కక్ష పెంచుకున్నాడు. ఆ భూమిలో సోమవారం రీసర్వే చేస్తుండగా కొడవలితో అక్కడికి వెళ్లాడు. రామకృష్ణప్పను నరికి పరారయ్యాడు. తీవ్రగాయాలైన రామకృష్ణప్ప మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు శివప్ప కోసం గాలింపు చేపట్టారు. గురువారం దోర్నాలపల్లి క్రాస్‌ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని, హత్యకు ఉపయోగించిన కొడవలిని స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement