చిలమత్తూరు: రెండేళ్లలో చంద్రబాబు అన్ని వర్గాలనూ నట్టేట ముంచారని వైఎస్సార్సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు ‘‘బాబు వెన్నుపోటుకు రెండేళ్లు’’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం హిందూపురంలోని పార్టీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్లు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా పాస్టర్లకు గౌరవ వేతనం ఇచ్చిన ఘనత వైఎస్ జగన్కు దక్కుతుందన్నారు. కానీ ఇప్పుడు ఏడాదిగా నిలుపుదల చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మైనారిటీలపై దాడులు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అందరినీ సమానంగా చూసే వైఎస్ జగన్ తిరిగి అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. పలువురు రైతులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉందని, వాటి ధరలు కూడా అమాంతం పెరిగిపోయాయన్నారు. రైతులకు భూములు లేకుండా లాక్కొంటున్నారని, వారు నిర్ణయించిందే ధరగా తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అన్నింటికీ ధరలు పెరుగుతున్నా రైతు పండించే పంటకు మాత్రం ధరలు లేవన్నారు. రెండేళ్లుగా సొంత జేబులు నింపుకుంటున్నారే గానీ రైతుల కడుపు నింపడంలో విఫలం చెందారన్నారు.
సంపద సృష్టి టీడీపీ నేతలకే...
సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు సృష్టించిన సొమ్ముతో పాటు అప్పులు చేసి మరీ టీడీపీ నేతల ఖాతాలకే మళ్లిస్తున్నారని వైఎస్సార్సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక మండిపడ్డారు. సృష్టించిన సంపదతో ఏమి అభివృద్ది చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం తిరోగమిస్తోందన్నారు. అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం చెందిన చంద్రబాబు సర్కారు అభివృద్ధిలోనూ వెనుకబడిందన్నారు. విద్య, వైద్యం అటకెక్కించారని దుయ్యబట్టారు. పదో తరగతి ఫలితాల్లో తేలిపోయారని, విద్యార్థులకు అందించిన బ్యాగులు పత్తాలేకుండా పోయాయని ఇప్పటికీ జగనన్న ఇచ్చిన నాణ్యమైన బ్యాగులు విద్యార్థులు వాడుతున్నారన్నారు. వైద్యం పేదలకు అందడం లేదన్నది వాస్తవమన్నారు. హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో ఎంఆర్ఐ స్కానింగ్ లేక బయటకు పంపిస్తున్నారని, గొప్పలు చెప్పే ఎమ్మెల్యే బాలకృష్ణకు ప్రజల ఇబ్బందులు కనిపించవా అని ప్రశ్నించారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు తినే తిండి ఎవరు పండిస్తున్నారో తెలియదా అని ప్రశ్నించారు. ఉన్న భూములను లాగేసుకొంటే ఆహారం కొరత ఏర్పడదా అని నిలదీశారు. రెండేళ్లలో అరాచక శక్తుల్ని, అవినీతిని సాధించారన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేసి తమ జేబులు నింపుకుందామని చూసిన బాబుకు వైఎస్ జగన్ చెక్ పెట్టారన్నారు.
సంపద సృష్టి అని సొంత జేబులు
నింపుకుంటున్నారు
అధ్వానంగా పరిపాలన సాగిస్తున్న చంద్రబాబు
వైఎస్సార్ సీపీ ‘పురం’ నియోజకవర్గ సమన్వయకర్త దీపిక ధ్వజం
ఇది అరాచక ప్రభుత్వం


