తాడిపత్రి రూరల్: తాడిపత్రి అప్గ్రేడ్ పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న మదన్రాజ్ (31) అనారోగ్యంతో కన్నుమూశారు. యాడికి మండల కేంద్రానికి చెందిన మదన్రాజ్ 2018లో కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో అనంతపురంలోని సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం మృతి చెందారు. మృతదేహాన్ని పట్టణ సమీపంలోని గన్నెవారిపల్లిలో నివాసానికి తీసుకురాగా, ఏఎస్పీ రోహిత్ కుమార్, సీఐ శివగంగాధర్రెడ్డి, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు త్రిలోక్నాథ్, లక్ష్మినారాయణ, శివారెడ్డి నివాళులర్పించారు. తాడిపత్రి హిందూ శ్మశానవాటికలో ప్రభుత్వ లాంఛనాలతో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కానిస్టేబుల్ భార్య అరుణకు ఎస్పీ జగదీష్ ఏఎస్పీ రోహిత్కుమార్ ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. అన్ని విధాల కానిస్టేబుల్ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసానిచ్చారు.
గంజాయి విక్రేత అరెస్ట్
గుంతకల్లుటౌన్: గంజాయిని అక్రమంగా తరలిస్తున్న షికారీ ఈశ్వర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ శివసాగర్ మంగళ వారం తెలిపారు. జిల్లా ఎకై ్సజ్ అధికారి ఆదేశాల మేరకు తమకు రాబడిన సమాచారం ప్రకారం హనుమాన్ సర్కిల్లో గంజాయిని తరలిస్తున్న నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచినట్లు ఆయన వెల్లడించారు.
విద్యుత్ చౌర్యంపై 55 కేసులు
అనంతపురం టౌన్: విద్యుత్ చౌర్యానికి పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని విద్యుత్ శాఖ విజిలెన్సు డీఈ రాజేష్ హెచ్చరించారు. మంగళవారం అనంతపురం రూరల్ మండలం నరసనేయునికుంట, కళ్యాణదుర్గం రోడ్డు పాపంపేట, తాడిపత్రి ప్రాంతాల్లో విజిలెన్సు అధికారులు తనిఖీలు నిర్వహించారు. విద్యుత్ మీటర్లకు వైర్లు పెట్టి విద్యుత్ అక్రమంగా వినియోగించడంతోపాటు తాడిపత్రి ప్రాంతంలో విద్యుత్ మీటర్లే లేకుండా నేరుగా విద్యుత్ వినియోగిస్తున్నట్లు గుర్తించి 55 కేసులను నమోదు చేశారు. అలాగే రూ.1.60 లక్షల మేర జరిమానా విధించినట్లు డీఈ వెల్లడించారు. దాడుల్లో విజిలెన్సు ఏడీ రాధిక, ఏఈ పీరాతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.


