చిలమత్తూరు: సుదూరంలోని దేశం నుంచి వేల మైళ్లు ఎగిరొస్తాయి. స్థానికులకు కనువిందు కలిగిస్తాయి. అలాంటి విదేశీ అతిథులకు కష్టాలే స్వాగతం పలుకుతుండడం కలచివేస్తోంది. ఈ సారి మండుతున్న ఎండలతో చెరువులు, కుంటలు కళతప్పాయి. నీటి కోసం పశువులు, జంతువులు, పక్షులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చిలమత్తూరు మండల పరిధిలోని వీరాపురం, వెంకటాపురం గ్రామాలకు సంతానోత్పత్తి కోసం వచ్చిన సైబీరియన్ కొంగలపై కూడా ఈ ప్రభావం పడింది. వర్షాభావంతో ఆయా చెరువుల్లో నీరు ఇంకిపోవడంతో విదేశీ పక్షులు ఆహారం కోసం అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. కలెక్టర్ మొదలు కిందిస్థాయి అధికారులు వీరాపురం వస్తున్నా కానీ సైబీరియన్ కొంగల పరిరక్షణకు కనీసం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.


