హిందూపురం: కరువు ప్రాంతాలైన హిందూపురం, మడకశిరకు హంద్రీనీవా కాలువతో చెరువులన్నింటినీ అనుసంధానం చేసి మడకశిర బ్రాంచ్ కెనాల్ ద్వారా 265 చెరువులను నింపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పట్టు రైతుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం హిందూపురంలోని పట్టుగూళ్ల మార్కెట్ సమావేశ మందిరంలో పట్టు రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సోమకుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘ గౌరవాధ్యక్షుడు ధనాపురం వెంకట్రామిరెడ్డి, కార్యదర్శి సిద్ధారెడ్డి, జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి పెద్దన్న మాట్లాడారు. పట్టు రైతులకు రైతులకు ఇన్సెంటివ్ మంజూరు చేస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేష్తో పాటు అంబికా లక్ష్మీనారాయణ, గుండుమాల తిప్పేస్వామి హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇంకా మంజూరు చేయించలేదని వాపోయారు. రాబోవు కాలంలో రైతులు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలపై అలు పెరగని పోరాటం సాగిస్తామన్నారు. సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సిరికల్చర్ ఇన్చార్జ్ ఏడీ హంపయ్య తెలిపారు. కార్యక్రమంలో పట్టు రైతు సంఘం కార్యదర్శి హరి, ఓపీడీఆర్ నాయకులు శ్రీనివాసులు, పరిగి నవీన్, ఆదినారాయణప్పా, నారాయణస్వామి, మడకశిర పట్టు రైతులు సదాశివరెడ్డి, వేమారెడ్డి, రామకృష్ణారెడ్డి, నరసగౌడ, గోవిందప్ప, ధర్మవరం పట్టు రైతులు చంద్రశేఖర్రెడ్డి, ఆదినారాయణప్ప తదితరులు పాల్గొన్నారు.


