కదిరి: మున్సిపల్ కమిషనర్గా పి.అజయ్కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (ఎఫ్ఏసీ) ఎం.తిరుమల కృష్ణబాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అజయ్ ప్రస్తుతం జిల్లా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా పని చేస్తున్నారు. డిప్యుటేషన్పై ఏడాది కాలానికి ఆయన్ను కదిరి మున్సిపల్ కమిషనర్గా నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గతంలో కదిరి మున్సిపల్ కమిషనర్గా ఉన్న కిరణ్కుమార్ను మాతృశాఖ (హార్టికల్చర్)కు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన బదిలీ అనంతరం ఇక్కడే ఏఈగా పని చేస్తున్న వి.సందీప్ ఇన్చార్జ్ కమిషనర్గా ఉన్నారు.
ఇద్దరు విలేజ్ సర్వేయర్లు సస్పెండ్
ప్రశాంతి నిలయం/కనగానపల్లి: ‘రీ సర్వే’లో నిర్లక్ష్యం వహించడమే కాకుండా కార్యాలయాలకు తరచూ ఆలస్యంగా వస్తున్న కనగానపల్లి మండలంలోని తూంచర్ల సర్వేయర్ వాణిశ్రీ, కేఎన్ పాళ్యం సర్వేయర్ శ్రీలతపై అధికారులు చర్యలు తీసుకున్నారు. జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశాల మేరకు వారిని శుక్రవారం సస్పెండ్ చేసినట్లు జిల్లా సర్వే, భూమి రికార్డుల అధికారి విజయశాంతి తెలిపారు. ప్రభుత్వ కార్యాక్రమాల అమలులో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
ముగిసిన ఇంటర్
సప్లిమెంటరీ పరీక్షలు
పుట్టపర్తి: జిల్లాలోని 32 కేంద్రాలో నిర్వహించిన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ముగిశాయి. చివరిరోజు ఉదయం ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఎకనామిక్స్–1 పరీక్ష నిర్వహించగా, 1,841 మందికి గాను 1,646 మంది హాజరయ్యారు. 195 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ చెన్నకేశవప్రసాద్ తెలిపారు. మధ్యాహ్నం సెకండ్ ఇయర్ విద్యార్థులకు నిర్వహించిన మేథమేటిక్స్–2 పరీక్షకు 1,566 మందికి గాను 1,388 మంది హాజరు కాగా, 178 మంది గైర్హాజరైనట్లు ఆయన వెల్లడించారు. చివరిరోజు 373 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు ఆయన వెల్లడించారు. జూన్ 6వ తేదీన పర్యావరణ విద్య, జూన్ 12న నైతికత, మానవతా విలువలు పరీక్ష జరుగుతుందన్నారు. జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ ప్రాక్టికల్స్ ఉంటాయన్నారు. ఇక వేసవి సెలవులు ముగియడంతో జూన్ 6 నుంచి కళాశాలలు పునః ప్రారంభవుతాయన్నారు.
వెంకటాపురం
జెడ్పీహెచ్ఎస్ తనిఖీ
చిలమత్తూరు: మండల పరిధిలోని వెంకటాపురం జెడ్పీహెచ్ఎస్ను డీఈఓ కిష్టప్ప శుక్రవారం తనిఖీ చేశారు. అర్ధంతరంగా ఆగిపోయిన నూతన భవనాన్ని పరిశీలించిన ఆయన సమస్య పరిష్కారానికి చర్యలు చేపడతామని తెలిపారు. పాఠశాల భవనం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డీఈఓకు విన్నవించారు. కార్యక్రమంలో ఎంఈఓ–1,2 హనుమంతరెడ్డి, సాల్మన్రాజ్ తదితరులు పాల్గొన్నారు.


