అనంతపురం సెంట్రల్: ‘రూ. లక్షకు మూడు లక్షల నకిలీ నోట్లు ఇస్తాం.. బ్లాక్ నోట్లను కెమికల్స్ ద్వారా ఒరిజనల్ నోట్లుగా మారుస్తా’మంటూ అమాయక ప్రజలను నమ్మించి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను అనంతపురం నాల్గో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను ఎస్ఐ ప్రసాద్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం గ్రామానికి చెందిన పానుగంటి నాగ శంకర్, కర్నూలు జిల్లా బెలగాల మండలం బ్యాతోలి గ్రామానికి చెందిన గొల్ల వెంకటేష్, కమ్మరి పరుశురాముడు ముఠాగా ఏర్పడి దోపిడీలకు పాల్పడేవారు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో సామాన్య ప్రజలను మోసం చేయడం అలవాటుగా చేసుకున్నారు. రూ. లక్షక్ష నిజమైన నగదు ఇస్తే కెమికల్ సాయంతో నకిలీ కరెన్సీని ఒరిజనల్గా మారుస్తామని నమ్మబలికేవారు. బాధితులను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి కత్తులతో బెదిరించి నగదు దోచుకొని పరారయ్యేవారు. అనంతపురం జిల్లాతో పాటు కాకుండా నంద్యాల, కర్నూలు పరిసర ప్రాంతాల్లో ఇలాంటి నేరాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. నిందితుల ఆచూకీపై సమాచారం రావడంతో తపోవనం సర్వీసు రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
ఘరానా ముఠా అరెస్ట్
రూ.1.35 లక్షలు స్వాధీనం


