పుట్టపర్తి అర్బన్: వరుసగా మూడోరోజు శుక్రవారం కూడా జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ నాలుగు మండలాల పరిధిలో వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం మరోసారి జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పుట్టపర్తి, గోరంట్ల, కొత్తచెరువు, బుక్కపట్నం మండలాల్లో రోడ్లపై వర్షపునీరు ప్రవహించింది. ఇక గురువారం రాత్రి గాండ్లపెంట మండలంలో 5.2 మి.మీ, ఎన్పీ కుంట మండలంలో 4.2 మి.మీ, లేపాక్షి మండలంలో 2.0 మి.మీ, కదిరి మండలంలో 1.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
జిల్లాకు వర్ష సూచన
అనంతపురం అగ్రికల్చర్: రాగల రెండు రోజులు ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు వారు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షం, మిగిలిన ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు కేరళను తాకి ఒకట్రెండు రోజుల్లో జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉండటంతో శుక్రవారం పగలు చాలావరకు ఆకాశం మేఘావృతమైంది. సాయంత్రం నార్పల, శింగనమల, ఆత్మకూరు, గుంతకల్లు, విడపనకల్లు, అనంతపురం, బుక్కరాయసముద్రం, తాడిపత్రి, కూడేరు, శెట్టూరు, యల్లనూరు తదితర మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది.


