హిందూపురం టౌన్: తమ ఆలోచనలకు పదును పెట్టి గోడలపై అద్భుతమైన చిత్రాలను గీసిన విద్యార్థుల సృజన అద్భుతమని కలెక్టర్ శ్యాం ప్రసాద్ కొనియాడారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని చౌడేశ్వరీ కాలనీలో ‘స్క్రాప్ థీమ్ పార్కు’ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ శుక్రవారం పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా పార్కులో సామూహిక వాల్ ఆర్ట్ పెయింగ్ కార్యక్రమం నిర్వహించగా, పిల్లలతో కలిసి కలెక్టర్ గోడపై బొమ్మలు వేశారు. కలెక్టర్ ప్రతి ఒక్క చిన్నారితో మాట్లాడి... వారు గీస్తున్న చిత్రాల వెనుక ఉన్న కాన్సెప్ట్ను తెలుసుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు వారు చూపిన చొరవను, వినూత్న కాన్సెప్ట్ను అభినందించారు. దాదాపుగా 400 మందికి పైగా మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా తరలివచ్చి పర్యావరణంపై తమకున్న ఆలోచనలను, అద్భుతమైన అభిప్రాయాలను పార్కు గోడలపై రంగురంగుల చిత్రాల రూపంలో తీర్చిదిద్దారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, మెప్మా పీడీ నాగరాజు, మున్సిపల్ అధికారులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు.
వీరాపురంలో పర్యటించిన కలెక్టర్
ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా శుక్రవారం కలెక్టర్ శ్యాంప్రసాద్ చిలమత్తూరు మండలం వీరాపురం గ్రామంలో పర్యటించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అలాగే వీరాపురం గ్రామంలోని సైబీరియన్ పక్షులను వీక్షించడానికి వచ్చే పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన వాచ్ టవర్ను పరిశీలించారు. విద్యార్థులకు బైనాక్యులర్లు అందించి, వాటి ద్వారా పక్షులను ఎలా చూడాలో స్వయంగా వివరించారు. అటవీ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీడ్ బాల్స్ స్టాల్ను కలెక్టర్ సందర్శించారు. సీడ్ బాల్స్ తయారు చేసే విధానాన్ని విద్యార్థులకు వివరించి, వాటిని పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలోని మహిళా సంఘాల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన టీ షాపును కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో పెనుకొండ అటవీ క్షేత్ర అధికారి శ్రీనివాసులు రెడ్డి, అటవీ శాఖ సిబ్బంది, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
గోడలపై పెయింట్ చూసి
ఆశ్చర్యపోయిన కలెక్టర్
‘పురం’లోస్క్రాప్ థీమ్
పార్కు పనుల పరిశీలన
విద్యార్థులతో కలిసి
పెయింటింగ్ వేసిన వైనం


