న్యూస్రీల్
రొద్దం: మండల పరిధిలోని రొద్దకంపల్లి గ్రామం సర్వేనంబర్ 97లోని వివాదాస్పద భూమిని బుధవారం కలెక్టర్ శ్యాం ప్రసాద్ పరిశీలించారు. ప్రభుత్వ కుంటను కొందరు ఆక్రమించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఆ రిజిస్ట్రేషన్ను రద్దు చేసి గతంలో ఇచ్చిన అనుమతుల మేరకు రైతులకు పట్టాలివ్వాలని గ్రామసభలో స్థానికులు కలెక్టర్ను కోరారు. దీంతో ఆయన సదరు స్థలాన్ని పరిశీలించారు. అంతకుముందు రొద్దకంపల్లి గ్రామసభలో పాల్గొన్న కలెక్టర్.. పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రి పనులను తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ ఆనంద్కుమార్, తహసీల్దార్ ఉదయ్శంకర్రాజు, ఎంపీడీఓ ఆనంద్ప్రసాద్ ఉన్నారు.
పరీక్షల నిర్వహణలో
పారదర్శకత లేదు
● సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి
మడకశిర రూరల్: జాతీయస్థాయి పరీక్షల నిర్వహణలో పారదర్శకత లేదని సీడబ్ల్యూసీ సభ్యుడు రాఘువీరారెడ్డి అన్నారు. కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుకుంటోందని ఆయన మండిపడ్డారు. జాతీయ పరీక్షల వివాదాలు, పేపర్ లీక్లు, నిర్వహణపై బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నీట్, యూజీసీ, ఎన్ఈటీ, సీయూఈటీ, సీబీఎస్ఈ పరీక్షల్లో వరుస వైఫల్యాలు కేంద్రం చేతగానితనానికి నిదర్శనమన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్కు పారదర్శకత, జవాబుదారీతనం లేదన్నారు. కేవలం అధికారులను మారిస్తేసరిపోదని, బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు.


