ప్రశాంతి నిలయం: జిల్లాలో 2026–27 సంవత్సరానికి మల్బరీ సాగు విస్తీర్ణాన్ని 10 వేల ఎకరాలకు పెంచాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో సెరికల్చర్ జేడీ, ఏడీలు, సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మల్బరీ సాగు విస్తీర్ణం పెంపు లక్ష్యాన్ని క్షేత్రస్థాయి సిబ్బందికి కేటాయించి విజయవంతం చేయాలన్నారు. అలాగే ఎకరాకు 900 కిలోల పట్టుగూళ్లు దిగుబడి సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హిందూపురంలో పట్టుగూళ్ల మార్కెట్ భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జేడీ శోభారాణి, ఏడీలు హనుమంతరాయ, వెంకటస్వామినాయక్, హంపయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
సమయ పాలన పాటించాలి
పుట్టపర్తి: సచివాలయ సిబ్బంది సమయపాలన కచ్చితంగా పాటించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లి సచివాలయాన్ని తనిఖీ చేశారు. సచివాలయాల ద్వారా ప్రజలకు అందుతున్న సేవల తీరును స్వయంగా పరిశీలించారు. నిర్ధేశిత సమయాల్లో అందుబాటులో ఉండి సేవలందించాలన్నారు.
భూసేకరణ పూర్తి చేయండి
ప్రశాంతి నిలయం: పుట్టపర్తి నియోజకవర్గంలోని 195 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు నీటి సరఫరా కల్పించే ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులు, నీటి పారుదలశాఖ ఇంజినీర్లు, రెవెన్యూ అధికారులు, సర్వేయర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. హెచ్ఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ నుంచి గ్రావిటీ, లిప్ట్ పద్ధతుల ద్వారా నీటిని అందించేందుకు భూసేకరణ, పెగ్ మార్కింగ్, సర్వే పనుల పురోగతిపై సమీక్షించారు.


