● ఎస్పీ సతీష్కుమార్
పుట్టపర్తి టౌన్: బానిస వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలని ఎస్పీ సతీష్కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రూరల్ అండ్ ఎన్విరాన్మెంట్ డెవెలప్మెంట్ సొసైటీ (రెడ్స్) ఆధ్వర్యంలో బానిస వ్యవస్థ నిర్మూలన చట్టంపై పోలీస్ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్పీ సతీష్కుమార్, అడిషనల్ ఎస్పీ అంకిత సురాన, జిల్లా లీగల్ సర్వీసెస్ సెల్ అథారిటీ కార్యదర్శి రాజశేఖర్ అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఎస్పీ మాట్లాడుతూ మహిళలు, పిల్లలు, మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరి వంటి సున్నితమైన అంశాలకు సంబంధించిన కేసుల విచారణలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, వన్స్టాప్ సెంటర్లు, రెడ్స్ వంటి గుర్తింపు పొందిన స్వచ్ఛంధ సంస్థలను సమన్వయం చేసుకొని చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. విదేశాల్లో ఉపాధి అంటూ జిల్లాలోని పలువురు మోసయిన సంఘటన ఉన్నాయన్నారు. బాధితుల రక్షణ కోసం భారత రాయబార కార్యాలయాలు, విదేశీ సంస్థలు సంబంధిత ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవాలన్నారు. జిల్లాలో ఆత్మహత్యల నివారణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. అనంతరం ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ ఆఫ్టర్ కేర్ అధికారిణి ప్రియాంక, రెడ్స్ స్వచ్ఛంధ సంస్థ డైరెక్టర్ భానూజ మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరి తదితర వాటిపై ప్రజెంటేషన్ ఇచ్చారు.


