ఒక్క అర్జీ పెండింగ్లో ఉండకూడదు
ప్రశాంతి నిలయం: ‘‘ ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రజలు కూడా కలెక్టరేట్లో అర్జీ ఇస్తే తప్పక సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకంతో ఉంటారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడంతో పాటు ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. అర్జీలన్నీ సకాలంలో పరిష్కరిస్తూ పెండింగ్ అనే మాటే వినిపించకుండా చూడాలి’’ అని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించిన ‘పరిష్కార వేదిక’లో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డీఆర్ఓ సూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తంగా 79 అర్జీలు అందగా.. వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. అనంతరం అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ప్రజల నుంచి అందిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు.
‘శాప్’ పోస్టర్ల ఆవిష్కరణ..
యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం ఆయన కలెక్టరేట్లోని తన ఛాంబర్లో రాష్ట్ర, జిల్లా స్థాయి శాప్ లీగ్ పోటీలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. యువతలో క్రీడా చైతన్యం పెంపొందించడం, ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రోత్సహించేందుకే శాప్ లీగ్ పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. శాప్ లీగ్లో అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, చెస్, ఫుట్బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, టేబుల్ టెన్నిస్ తదితర 31 క్రీడాంశాల్లో పోటీలు ఉంటాయన్నారు. క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రతిభ చాటాలన్నారు. జిల్లాకు చెందిన క్రీడాకారులు https://sports.ap.gov.in వెబ్సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.
జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలి
జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు యంత్రాంగం సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. సోమవారం ఆయన జేసీ మౌర్య భరద్వాజ్తో కలిసి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా అధికారులతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా పీ4 కార్యక్రమం, పదో తరగతి వంద రోజుల ప్రణాళిక, క్లెయిం చేయని డిపాజిట్లు, పీజీఆర్ఎస్ సమస్యలు, పీఎం సూర్యఘర్, స్వర్ణాంధ్రా– స్వచ్ఛాంధ్ర, గృహ నిర్మాణం, తాగునీటి సరఫరా తదితర కార్యక్రమాలపై సమీక్షించారు.
‘పీజీఆర్ఎస్’ అర్జీలకు
ప్రాధాన్యం ఇవ్వాలి
నిర్దిష్ట గడువులోపు నాణ్యమైన
పరిష్కారం చూపాలి
అధికారులకు కలెక్టర్
శ్యాంప్రసాద్ ఆదేశం


