నేడు దామోదరం సంజీవయ్య జయంతి
ప్రశాంతి నిలయం: ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దివంగత దామోదరం సంజీవయ్య 105 జయంతి వేడుకలు శనివారం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఉదయం 10 గంటలకు సంజీవయ్య చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి జిల్లా అధికారులు, దళిత సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు తప్పక హాజరై సంజీవయ్య జయంతి వేడుకలను జయప్రదం చేయాలని కోరారు.
బీటెక్ ఫలితాల విడుదల
అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో శుక్రవారం బీటెక్ ఫలితాలు విడుదలయ్యాయి. డిసెంబర్, జనవరి నెలలో నిర్వహించిన బీటెక్ మొదటి సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–23) రెగ్యులర్, సప్లిమెంటరీ, (ఆర్–20), (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ ఫలితాలు, రెండో సెమిస్టర్ (ఆర్–23), (ఆర్–20), (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ, బీసీఏ మొదటి సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–24)రెగ్యులర్, బీబీఏ రెండో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (24) రెగ్యులర్, బీబీఏ ఒకటో సంవత్సరం ఒకటో సెమిస్టర్ రెండో సెమిస్టర్ (24) సప్లిమెంటరీ ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ వి.నాగప్రసాద నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ డాక్టర్ ఎం.అంకారావు, డాక్టర్ శారద, డాక్టర్ ఎస్. శ్రీధర్ విడుదల చేశారు. ఫలితాలు యూనివర్సిటీ వెబ్సైట్లో చూడాలని కోరారు.
అందుబాటులో
ఇంటర్ హాల్టికెట్లు
● ఫీజు బకాయిలకు హాల్టికెట్లకు
ముడిపెడితే చర్యలు
● ఇంటర్ బోర్డు ఆర్ఐఓ
వెంకటరమణనాయక్
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ థియరీ పరీక్షలకు సంబంధించి హాల్టికెట్లు అందుబాటులో ఉన్నాయని ఇంటర్ బోర్డు ఆర్ఐఓ వెంకటరమణనాయక్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. హాల్టికెట్లు bie.ap.gov.in వెబ్సైట్లో ఉంచారని వివరించారు. జిల్లాలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ఫీజు బకాయిలకు, హాల్టికెట్లకు ముడిపెట్టొద్దని ఆదేశించారు. ప్రతి విద్యార్థికీ హాల్ టికెట్ పంపిణీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. మనమిత్ర (వాట్సాప్ గవర్నెన్స్) 95523 00009 ద్వారా కూడా హాల్టికెట్లు పొందవచ్చని పేర్కొన్నారు. హాల్టికెట్లపై సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ సంతకం లేకుండా కూడా విద్యార్థులు పరీక్షలకు హాజరుకావచ్చన్నారు.
ఈ పరీక్షలు తేదీలు మారాయి..
ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 23 నుంచి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 24 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. రోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరుగుతాయి. హోలీ, రంజాన్ పండుగల నేపథ్యంలో కొన్ని పరీక్షల తేదీలు మార్పు చేసినట్లు ఆర్ఐఓ పేర్కొన్నారు. మార్చి 3న జరగాల్సిన ద్వితీయ సంవత్సరం గణితం, సివిక్స్ పరీక్షలు 4వ తేదీకి మార్పు చేసినట్లు తెలిపారు. అలాగే మార్చి 20న మొదటి సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్ పరీక్షలు 21వ తేదీకి మార్పు చేసినట్లు వెల్లడించారు.
ముగిసిన
ఏపీపీఎస్సీ పరీక్షలు
అనంతపురం అర్బన్: ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 9న ప్రారంభమైన పరీక్షలు శుక్రవారం ముగిశాయి. జిల్లా ఖజానా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన జవాబు పత్రాలను డీఆర్ఓ మలోల పర్యవేక్షణలో ప్రత్యేక బస్సులో పోలీసు బందోబస్తు ద్వారా విజయవాడకు తరలించారు. కార్యక్రమంలో పరిపాలనాధికారి అలెగ్జాండర్, ఏపీపీఎస్సీ అధికారులు పాల్గొన్నారు.
నేడు దామోదరం సంజీవయ్య జయంతి


