ఒక్క మాత్రతో నులిమేద్దాం..
● నేడు జాతీయ నులిపురుగుల
నివారణ దినం
● 19 ఏళ్లలోపు 5,47,470 మంది
● 6,07,000 ఆల్బెండజోల్ మాత్రలు సిద్ధం
నెల్లూరు(అర్బన్): చిన్నారుల్లో శారీరక, మానసిక ఎదుగుదలను నిరోధించి పోషకాలను గ్రహించి వారిని శక్తిహీనులుగా మారుస్తాయి నులిపురుగులు. అవి పిల్లల్లోని రక్తాన్ని పేగుల నుంచి శోషిస్తాయి. ఫలితంగా రక్తహీనత పెరిగిపోతుంది. తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం కాదు. ఆకలి మందగిస్తుంది. దీంతో పిల్లలు నీరసించిపోయి పనులు, చదువుపై ధ్యాస కోల్పోతారు. ఈ పరిస్థితిని గమనించిన భారత ప్రభుత్వం ఫిబ్రవరి 10వ తేదీని జాతీయ నులి పురుగుల నివారణ దినంగా ప్రకటించింది. మనరాష్ట్రంలో ఈనెల 17వ తేదీన ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో మంగళవారం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైద్యశాఖాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
80 శాతం మంది పిల్లల్లో రక్తహీనత
ప్రభుత్వం జరిపిన ఓ సర్వేలో పిల్లల్లో 80 శాతం రక్తహీనత ఉన్నట్టు గుర్తించారు. జిల్లాలో వైద్యశాఖ సర్వే లెక్కల ప్రకారం 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలు 5,47,470 మంది ఉన్నారు. వీరిలో కనీసం 4 లక్షల మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం నులిపురుగులేనని తేలింది. వీరి కోసం 6,07,000 మాత్రలను సిద్ధం చేశారు. 2,912 అంగన్వాడీ కేంద్రాలు, 2,594 ప్రభుత్వ, 811 ప్రైవేట్ పాఠశాలలు, 140 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ఒకేరోజు మాత్ర ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఆరోజు రాని వారికి ఈనెల 24వ తేదీన అందిస్తారు.
నులిపురుగులకు చెక్
1 నుంచి 19 ఏళ్లలోపు వారికి అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఉపాధ్యాయుల సహకారంతో నులిపురుగుల నివారణ మాత్రలు ఇవ్వబోతున్నాం. ఒక్క ఆల్బెండజోల్ మాత్రను నమిలి మింగించడం ద్వారా బిడ్డ పొట్టలోని పరాన్న జీవుల పెరుగుదలను అరికట్టొచ్చు. పురుగుల పునరుత్పత్తిని నివారించవచ్చు. తద్వారా పిల్లల ఆరోగ్యం, పోషకాహార స్థితి మెరుగుపడుతుంది. పాఠశాలల్లో హాజరు, ఏకాగ్రత పెరుగుతుంది. – వి.సుజాత, డీఎంహెచ్ఓ
ఒక్క మాత్రతో నులిమేద్దాం..


