హుస్నాబాద్: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన విద్యార్థుల నుంచి డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ భిక్షపతి తెలిపారు. దోస్త్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. జూన్ 15వ తేదీ లోగా వివిధ డిగ్రీ కోర్సులలో ప్రవేశం కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
పెండింగ్ సమస్యలు పరిష్కరించరూ..
మంత్రి దామోదరను
కలిసిన నిర్వాసితులు
గజ్వేల్: పెండింగ్లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ నిర్వాసితులు గురువారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదరను కలిశారు. అర్హులైన ఎంతోమందికి ఇళ్ల స్థలాలు, ఆర్అండ్ఆర్, ఒంటరి మహిళలకు ప్యాకేజీలు పెండింగ్లో ఉన్నాయని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మంత్రి.. త్వరలో చర్యలు చేపట్టాలని కలెక్టర్కు ఫోన్ ద్వారా సూచించారు. మంత్రిని కలిసినవారిలో మల్లన్నసాగర్ నిర్వాసిత గ్రామాలకు చెందిన హయతోద్దీన్, శ్రీనివాస్రెడ్డితోపాటు కొండపోచమ్మసాగర్ నిర్వాసిత కాలనీకి చెందిన నాయకులు పాల్గొన్నారు.
దివ్యాంగుల
సంక్షేమానికి చర్యలు
జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రకాశ్
మిరుదొడ్డి(దుబ్బాక): దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఐబీ ప్రకాష్ తెలిపారు. గురువారం మిరుదొడ్డిలోని వికలాంగుల పునరావాస కేంద్రంలో ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో దివ్యాంగుల సంఘాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల మాదిరిగా దివ్యాంగుల సంఘాల సభ్యులకు బ్యాంకు రుణాలు, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా ఏపీఎం డాకయ్య, మండల ఏపీఎం లక్ష్మీనర్సమ్మ, మండల సమాఖ్య అధ్యక్షురాలు గౌతమి, సహారా ఎన్జీఓ ప్రతినిధులు, సీసీలు, నైబర్ హుడ్ సెంటర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రధాన రోడ్డుకు మరమ్మతులు
గజ్వేల్: గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో దెబ్బతిన్న ప్రధాన రోడ్డు మరమ్మతులపై మున్సిపల్ పాలకవర్గం దృష్టి సారించింది. కొంతకాలంగా ఈ రోడ్డుపై గుంతలు ఏర్పడి వాహనదారులకు నరకం చూపుతున్నాయి. తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం మరమ్మతు పనులను మున్సిపల్ చైర్పర్సన్ గంగిశెట్టి చందన ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మబాయి, కౌన్సిలర్లు స్వప్న, మన్నె రూప పాల్గొన్నారు.
అథ్లెటిక్స్లో జిల్లా ప్రతిభ
సిద్దిపేటజోన్: ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్న సీనియర్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సిద్దిపేట క్రీడాకారులు ప్రతిభ చూపారు. తొలిరోజు రెండు పతకాలు దక్కాయి. ట్రిపుల్ జంప్ విభాగంలో రాహుల్ బంగారు పతకం, 100 మీటర్ల పరుగులో జ్ఞానేశ్వర్ వెండి పతకం సాధించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడల శాఖ అధికారి వీరారెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పరమేశ్వర్, కార్యదర్శి వెంకట్స్వామి తదితరులు అభినందించారు.


