● తగిన తేమ లేకపోతే నష్టమే.. ● వ్యవసాయ అధికారి సూచనలు
చిన్నకోడూరు(సిద్దిపేట): వర్షాకాలం ప్రారంభం కావడంతో రైతులు సాగుపనుల్లో నిమగ్నమయ్యారు. తొలకరి జల్లులు కురువగానే విత్తనాలు వేసేందుకు కొందరు రైతులు సిద్ధమవుతున్నారు. ఇలా తొందరడి విత్తనాలు వేయడం వల్ల రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని మండల వ్యవసాయశాఖ అధికారి జయంత్ కుమార్ తెలిపారు.
భూమిలో తగినంత తేమ లేనప్పుడు విత్తనాలు వేయడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. పత్తి, మొక్కజొన్న విత్తనాలు వేసేటప్పుడు రైతులు మరింత అప్రమత్తంగా ఉండాలి. సరైన తేమ లేకుండా విత్తితే మొలక శాతం గణనీయంగా తగ్గిపోతుంది. దీంతో రైతుల శ్రమ, పెట్టుబడి వృథాగా పోతుంది. మళ్లీ విత్తనాలు వేయాల్సి వస్తుంది. దీంతో రైతులపై మరింత ఆర్థిక భారం పడుతుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల భూమిలోని ఒక అంగుళం పొర వరకు మాత్రమే తేమ లభిస్తుంది. కాబట్టి కనీసం 60మిమీ వర్షపాతం నమోదై, భూమి లోపలి పొరల వరకు తగినంత తేమ చేరిన తరువాత మాత్రమే విత్తనాలు నాటడం ప్రారంభించాలి.
పొడిగా ఉన్నప్పుడు విత్తనాలు మొలకెత్తడానికి అవసరమైనంత తేమ అందదు. దీంతో మొలకెత్తటం కష్టంగా మారుతుంది. కొన్ని విత్తనాలు మొలకెత్తినప్పటికీ అవి ఎండల తీవ్రతకు తట్టుకోలేక ఎండిపోయే ప్రమాదం ఉంది. విత్తనం పెట్టిన తరువాత ఎండల తీవ్రత పెరిగితే భూమిలోని వేడికి విత్తనం మురిగిపోతుంది. తగినంత తేమ లేకుండా విత్తడం వల్ల మొక్కల ఎదుగుదల కూడా సరిగా ఉండదు.


