సిద్దిపేటజోన్: వానాకాలం సీజన్ ప్రారంభం కానుందని, ముందస్తు చర్యలు చేపట్టి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే హరీశ్రావు సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. శనివారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ ఎస్ఈ, డీఈ, ఏఈలతో నియోజకవర్గ పరిధిలోని ప్రాజెక్టులు, స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు. చందళపూర్ లిఫ్ట్, ఇర్కోడ్ లిఫ్ట్ పనుల్లో జాప్యం జరుగుతోందని, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గోపులపూర్ చెక్ డ్యామ్, కస్తూరి పల్లి చెక్డ్యామ్ పనులు ఇంకా ప్రారంభం కాలేదని, వెంటనే ప్రారంభించాలని చెప్పారు. ఇటీవల మంజూరైన మిట్టపల్లి, గుండ్ల చెరువు వంతెన పనులు, రాఘవాపూర్ ఇంద్రగూడెం పల్లెకుంట పనులు, ముండ్రాయి మెరుపుకుంట పనులు వేగవంతం చేయాలని సూచించారు. రంగనాయకసాగర్ నుంచి అనంతసాగర్ కాల్వ సర్వే పనులు 6కిలోమీటర్లకు గాను 3 కిలోమీటర్ల సర్వే పూర్తి అయిందని, వచ్చే యాసంగి నాటికి నీళ్లు అందేలా చూడాలన్నారు. అనంత సాగర్ నుంచి అల్లిపూర్ కర్ణాలకుంటకు లిఫ్ట్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. నారాయణరావుపేట మండలం మల్కాచెరువు వద్ద పైప్ లైన్ వేయాలని, దీని వల్ల కింది గ్రామాలకు నీరు అందుతుం దన్నారు. మల్లన్నసాగర్ నుంచి వచ్చే 4ఆర్ కాల్వలో భాగంగా రాఘవాపూర్ కన్నయ్య కుంటకు శాశ్వతంగా కాల్వ నిర్మాణం పనులు చేపట్టాలని సూచించారు. పాలమాకుల ఊర చెరువు బ్లాస్టింగ్ పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో ఎస్ఈ కిరణ్ ఈఈ వీర స్వామి, అధికారులు రమేష్ జాదవ్, శంకర్, సదయ్య తదితరులు పాల్గొన్నారు.
వర్షాకాలంలో
రైతులకు ఇబ్బంది కలగొద్దు
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
ఇరిగేషన్ పెండింగ్ పనులు
పూర్తి చేయాలి
అధికారులతో
ఎమ్మెల్యే హరీశ్రావు సమీక్ష


