సిద్దిపేటఅర్బన్: డిజిటల్ అరెస్టు పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ సూచించారు. సిద్దిపేట షీ టీం ఆధ్వర్యంలో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మిట్టపల్లిలోని సురభి మెడికల్ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. డ్రగ్స్, మత్తు పదార్థాల అనర్థాలపై యువత అవగాహన పెంచుకోవాలన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దని, ఆన్లైన్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. విద్యార్థి జీవితంలో ర్యాగింగ్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన వాతావరణంలో చదువుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఎలా ఫిర్యాదు చేయాలని, ఎలా ఎదుర్కోవాలనే విషయాలపై అవగాహన కల్పించారు. వైద్యులు, పోలీసులు 24 గంటలు ప్రజల కోసమే శ్రమిస్తారని, ఏ సమస్య ఎదురైనా తక్షణమే పోలీసులను సంప్రదించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శైలజ, షీ టీం ఇన్స్పెక్టర్ దుర్గ, త్రీటౌన్ సీఐ లక్ష్మీబాబు, కళాశాల ఏఓ అమృత్పాల్సింగ్, ఎంబీబీఎస్, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.
పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్


