అక్కన్నపేట(హుస్నాబాద్): గౌరవెల్లి రిజర్వాయర్ కట్టపై మద్యం తాగితే తాటతీస్తామని ఈఈ రాములునాయక్, ఎస్ఐ చాతరాజు ప్రశాంత్ అన్నారు. ఎన్జీటీ కేసులో భాగంగా ప్రాజెక్టు కట్టపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం నీటిపారుదల శాఖ ఈఈ రాములునాయక్ ఆధ్వర్యంలో ఎస్ఐ ప్రశాంత్ సీసీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మందుతాగితే చర్యలు చేపడ తామన్నారు. ప్రాజెక్టు కట్టపై నిరంతరం పోలీసుల పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. రాత్రి వేళ కూడా గస్తీ ఉంటుందన్నారు. గతంలో ఈ ప్రాజెక్టు కట్టపై సీసీ కెమెరాలను గుర్తుతెలియని వారు ధ్వంసం చేయడంతో నీటిపారుదల శాఖ అధికారులు పోలీసులకు ఆశ్రయించారు. దీంతో గౌరవెల్లి పోలీసుల పర్యవేక్షణలో ఉంటుందని ఈఈ తెలిపారు.


