డుమ్మా కొట్టిన వారి వివరాల సేకరణ
25 మంది అధికారులకు
● వారి పనితీరుపై కలెక్టర్ హైమావతి సీరియస్
● 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశం
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లలో జిల్లా అధికారుల నిర్లక్ష్యం, సమీక్షలకు గైర్హాజరు వంటి కారణాలపై కలెక్టర్ హైమావతి సీరియస్ అయ్యారు. ఈ మేరకు 25 మంది ఆయా శాఖల జిల్లా అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో, డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన అవతరణ వేడుకలకు గైర్హాజరు, వివిధ శాఖలకు సంబంధించిన లబ్ధిదారులను తీసుకురాకపోవడం, గ్రౌండ్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగం సమయంలో ఖాళీ కుర్చీలే దర్శనమివ్వడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. డిగ్రీ కళాశాల గ్రౌండ్లో కేటాయించిన శాఖలు స్టాల్స్ సైతం ఏర్పాటు చేయలేదు. అలాగే కలెక్టరేట్లో మంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశం ఉందని సమాచారం అందించినా పలువురు జిల్లా అధికారులు డుమ్మా కొట్టారు. దీంతో షోకాజ్ నోటీసులు జారీ చేసి 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు. ఒకే సారి 25 మంది జిల్లా అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ కావడంతో సర్వత్రా చర్చ సాగుతోంది.
జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆయా శాఖల ఉద్యోగులు కేవలం 30శాతం మందే హాజరయ్యారు. ఎవరెవరు వేడుకలకు హాజరయ్యారు.. గైర్హాజరైన వారి వివరాలను కలెక్టరేట్ సేకరించింది. త్వరలో వారికి సైతం నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర అవతరణ వేడుకల్లోనూ అధికారులు డుమ్మా, నిర్లక్ష్యం చూస్తుంటే విధుల పట్ల వారికి ఎంత నిబద్ధత ఉందో అర్థమవుతోంది.


